'తెలంగాణ' బాధ్యతను భుజానేసుకున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలను తాము ఆదుకుంటామని చెప్పారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. అక్రమాలకు పాల్పడ్డవారు చాలామంది జైలులో ఉన్నారని, కాంగ్రెసు నేతలు అంతా జైలులో ఉండాల్సిన వారన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో రాష్ట్రాన్ని దోచుకున్నారని, కిరణ్ ప్రభుత్వానికి ప్రజలు పట్టడం లేదన్నారు.
కొన్ని ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు పెత్తందారిగా వ్యవహరిస్తుండగా ప్రజలు బానిసలుగా ఉండాల్సిన దుస్థితి కొనసాగుతోందంటూ మంత్రి డికె అరుణపై పరోక్షంగా మండిపడ్డారు. గిరిజన నాయకుడు కొమురం భీం, వాల్మీకి స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ పని చేస్తుందని అన్నారు. బాబు ప్రజలతో కలిసిపోయి వారితో ముచ్చటించారు. పొలాలు, కల్వర్టులు, చౌరస్తాల్లో ఆగి రైతులతో, స్థానికులతో, ఉద్యోగులతో మాట్లాడారు.
సోమవారం గంటకు రెండు కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర కొనసాగింది. కాగా చంద్రబాబుకు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకె అధినేత కరుణానిధి లేఖ రాశారు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ లేఖ రాశారు. పాదయాత్ర సందర్భంగా తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. యాత్రలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా గద్వాల్ పట్టణంలో వేదిక కూలడంతో చంద్రబాబు వెన్నుకు దెబ్బతగిలిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వర్లు సోమవారం ఉదయం చంద్రబాబు పాదయాత్ర వద్దకు వచ్చి సంఘీభావం ప్రకటించారు. చంద్రబాబు పాదయాత్రతో తెలంగాణ సమస్యకు పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని చుక్కా రామయ్య వ్యక్తం చేశారు.