జగన్ వచ్చినా అంతే, నాకంటే చెర్రీనే బెట్టర్: చిరంజీవి
వలసలపై ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదన్నారు. ప్రజలు తమ వెంట ఉన్నారన్నారు. కేంద్ర పదవిలో ఉన్నప్పటికీ తాను రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటానని చెప్పారు. భవిష్యత్తులో రాష్ట్ర నాయకత్వం తన నేతృత్వంలో పని చేస్తుందని తాను భావించడం లేదని, అయితే అధిష్టానం ఏ బాధ్యత మోపినా స్వీకరిస్తానన్నారు. ప్రజల కోసం పాదయాత్రలు చేస్తే తప్పు లేదని కానీ, ఆ వంకతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం సరికాదన్నారు.
తాను నెలలో నాలుగైదు రోజులు రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. కొందరు నేతలు వెళ్లడం వల్ల నాయకత్వ శ్రేణుల్లో కొత్త రక్తం వస్తుందన్నారు. ఇది మంచి విషయమన్నారు. ప్రజలతో సంబంధాలు కొనసాగాలంటే నేరుగా వారితో సంబంధముండే శాఖనే చేపట్టాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెసు పార్టీ సామాజి న్యాయం పాటించిందని, కేంద్రమంత్రివర్గం సమతూకంతో ఉందన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలోనూ ఢిల్లీ ఫార్ములా ఉండే అవకాశముందన్నారు.
దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధిష్టానం నిర్ణయానికి తాను కట్టబడి ఉంటానని చెప్పారు. కాకతీయ ఉత్సవాలకు రూ.25 లక్షలే మంజూరు చేయడంపై స్పందిస్తూ.. తన పరిధిలో కేవలం రూ.10 లక్షల వరకే మంజూరు చేయవచ్చునని అధికారులు చెప్పినా తాను రూ.25 లక్షలు కేటాయించానని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం పాదయాత్ర చేయాలన్న హరిరామ జోగయ్య వ్యాఖ్యలు ఎగతాళి చేసినట్లుగా ఉందన్నారు.
కాగా మళ్లీ సినిమాల్లో నటించడానికి సమయం ఉంటుందా చెప్పలేమని, సమయం దొరికితే అభిమానుల కోరిక తీర్చుతానని, ఖైదీ సినిమా రీమేక్కు తన కంటే తన తనయుడు రామ్ చరణ్ తేజనే ఎక్కవగా సరిపోతాడని చెప్పారు. సినిమా విషయంలో ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలని, అలా అని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూడవద్దన్నారు.