హార్డ్కోర్ కాంగ్రెసు 'సమైక్య' ఎంపిలు: 'చిరు' తోడు
హైదరాబాద్: కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ప్రాంతాలవారీగా విడిపోవడంతో తెలంగాణ అంశంపై కచ్చితమైన నిర్ణయం తీసుకోవడం పార్టీ అధిష్టానానికి కష్టంగా ఉంది. ఇటు తెలంగాణ పార్లమెంటు సభ్యుల వాదనను తిప్పికొట్టడానికి కాంగ్రెసు సిఎం పార్లమెంటు సభ్యులు కొంత మంది ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా అధిష్టానం వద్ద వారు లాబీయింగ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వారి వల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆటంకాలు ఎదురవుతున్నాయని అంటున్నారు. వారు కాంగ్రెసు అతివాద సమైక్యవాద ఎంపిలుగా పేరు పడ్డారు.


లగడపాటిని సరదాగా జగడపాటి అంటారు. విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అతివాద సమైక్యవాదుల్లో అతివాదిగా పేరు పడ్డారు. ఎప్పటికప్పుడు తెలంగాణ వాదాన్ని తిప్పికొట్టడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. తనదైన వాదనను తనదైన శైలిలో వ్యక్తీకరించడం ఆయన ప్రత్యేకత. తన వాదనను సిద్ధాంతీకరించే ప్రయత్నాలు కూడా ఆయున చేస్తుంటారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా విజయవాడలో దీక్ష చేపట్టి, అక్కడి నుంచి రహస్యంగా హైదరాబాదుకు చేరుకుని అప్పట్లో ఓ సంచలనం సృష్టించారు.

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కాంగ్రెసు పార్లమెటు సభ్యుడు కావూరి సాంబశివరావుది సమైక్యవాదుల్లో విశిష్టమైన స్థానం. ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి వ్యూహరచన చేసి, దానికి అనుగుణమైన కార్యాచరణను చేపట్టడంలో ఆయనది అందె వేసిన చేయి అంటారు. ఆందోళనలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చి, లాబీయింగ్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటారని అంటారు.

కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు పక్కా సమైక్యవాది. సమైక్యవాద కార్యక్రమాల్లో ఆయనది క్రియాశీలకమైన పాత్రే. తెలంగాణవాదాన్ని ఎదుర్కోవడంలో ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నారు.
కేంద్ర మంత్రులు సహా సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు చాలా మంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నప్పటికీ పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. పైగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి వారు తోడ్పాటు అందిస్తున్నారనే తప్ప అదే పనిగా దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడం లేదు. కేంద్ర మంత్రులు దగ్గుబాటి పురంధేశ్వరి, పనబాక లక్ష్మి, పురంధేశ్వరి వంటి కేంద్ర మంత్రులు, జెడి శీలం తదితర సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు తెలంగాణకు వ్యతిరేకంగానే ఉన్నారు. అయితే, వారు సమైక్యాంధ్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించడం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాయపాటి, లగడపాటి, కావూరి వల్లనే సాధ్యం కావడం లేదని తెలంగాణవాదులు ఎప్పటికప్పుడు గుర్రుమంటూనే ఉన్నారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడం వల్ల తెలంగాణ వ్యతిరేక పార్టీల్లో ఒక పార్టీ తగ్గిందని తెలంగాణవాదులు చెబుతున్నప్పటికీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రూపంలో ఆ స్థానం భర్తీ అయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్లమెంటులో సమైక్యవాద ప్లకార్డులను ప్రదర్శించి ఆరణాల సమైక్యవాదిగా పేరు తెచ్చుకున్నారు.












Click it and Unblock the Notifications