అద్వానీ డుమ్మా: కోర్ గ్రూప్ మద్దతు, గడ్కరీకి ఊరట
గడ్కరీకి మద్దతుగా బిజెపి సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. గడ్కరీపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, గడ్కరీ వ్యాపార సంస్థలన్నీ చట్టబద్దంగానే ఉన్నాయని వారు ఆ ప్రకటనలో చెప్పారు. గడ్కరీ వెంటనే రాజీనామా చేయాలంటూ రాజీనామాస్త్రం సంధించిన రాంజెఠ్మలానీ ఆర్ఎస్ఎస్ రంగప్రవేశంతో మెత్తబడ్డారు. గడ్కరీ కొనసాగాలని భావిస్తున్న ఆర్ఎస్ఎస్ తన తరఫున గురుమూర్తిని రంగంలోకి దింపింది.
గురుమూర్తి రాంజెఠ్మలానీతో చర్చలు జరిపారు. అద్వానీ గైర్హాజరు ప్రాముఖ్యాన్ని తగ్గించడానికి బిజెపి నాయకులు ప్రయత్నించారు. ఉదయం పూటనే అద్వానీ మాట్లాడారాని బిజెపి నాయకులు అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా గడ్కరీ పదవీ కాలం మరో వారాల్లో ముగుస్తుంది. తక్షణమే గడ్కరీని తొలగించి, తాను అధ్యక్ష పదవిని చేపట్టాలనే ఉద్దేశంతో అద్వానీ ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే, వచ్చే ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ముందుకు తెచ్చే ఉద్దేశంతో గడ్కరీని కొనసాగించడం అవసరమని ఆర్ఎస్ఎస్ భావించినట్లు చెబుతున్నారు. కోర్ గ్రూప్ సమావేశంలో గడ్కరీని కొనసాగించాల్సిన అవసరాన్ని గురుమూర్తి వివరించినట్లు తెలుస్తోంది. మోడీని అడ్డుకుని, తాము ముందుకు రావాలంటే గడ్కరీని తక్షణమే తప్పించి, ఆ స్థానంలోకి తాము రావాలనే ఉద్దేశం కొంత మంది సీనియర్ నాయకుల్లో కనిపించిందని, దానివల్ల గడ్కరీకి వ్యతిరేకంగా సీనియర్ నాయకులు గొంతు విప్పారని అంటున్నారు.