అమెరికాలో పోలింగ్ షురూ: తటస్థ రాష్ట్రాలే కీలకం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మంగళవాంర పోలింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా, రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ మధ్య హోరాహోరీ పోరు నెలకొని ఉంది. విజయాన్ని కొద్ది రాష్ట్రాలు మాత్రమే నిర్ణయిచే అవకాశాలున్నాయి. తటస్థ రాష్ట్రాలు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి.
కొలరాడో, ఫ్లోరిడా, ఐవునా, మిచిగాన్, నెవడా, న్యూహాంఫ్షైర్, న్యూమెక్సిక్, ఉత్తర కరోలినా, ఓహియో, పెన్సిల్వేనియా, వర్జీనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో జరిగే ఓటింగే అధ్యక్ష ఎన్నికల్లో విజేతను నిర్ణయించే అవకాశాలున్నాయని అంచనాలు వేస్తున్నారు. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో రిపబ్లికన్లు, మరికొన్ని రాష్ట్రాల్లో డెమొక్రాట్లు ఆధిపత్యంలో ఉన్నారు. దీంతో తటస్థ రాష్ట్రాలు ఎవరి వైపు మొగ్గు చూపితే వారు విజయం సాధిస్తారు.
అయితే, ఆ తటస్థ రాష్ట్రాలు ఎటు మొగ్గు చూపుతాయనేది చెప్పడం కష్టంగానే ఉంది. ఈ రాష్ట్రాల వోటింగ్ సరళి ప్రత్యేకంగా ఉంది. కొలరాడో రాష్టాన్ని చూస్తే 2000, 2004 ఎన్నికల్లో రిపబ్లికన్లను బలపరిస్తే, 2008 ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ వైపు నిలిచారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రోరల్ కాలేజీ ప్రతినిధుల సంఖ్య సమానంగా ఉండదు. కాలిఫోర్నియాలో 55 మంది ఉంటే, పూర్తి గ్రామీణ ప్రాంతమైన మెంటానాలో మూడు స్థానాలు మాత్రమే ఉన్నాయి.
సర్వేలు మాత్రం రోమ్నీపై ఒబామాకే ఆధిక్యతను చూపుతున్నాయి. తూర్పు అమెరికాలోనూ మిడ్వెస్ట్లోని కొన్ని ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలు తెల్లవారు జామునే తెరుచుకున్నాయి. మొత్తం 17 కోట్ల మంది ఓటర్లున్నారు. రోమ్నీ అత్యంత సంపన్నుల్లో ఒకరు. రోమ్నీ గెలిస్తే అమెరికాలోని సంపన్నమైన నాయకుడు శ్వేతసౌధంలోకి అడుగు పెడతాడు.
ఆర్థిక పరిస్థితి పుంజుకోవడంలో వైఫల్యం, నిరుద్యోగ సమస్య వంటివి ఈ సమరంలో ప్రధానాంశాలు అయ్యాయి. మధ్య మధ్య ఇరువురి మధ్య వ్యక్తిగత ఆరోపణలు కూడా చోటు చేసుకున్నాయి. భారత కాలమానం ప్రకారం రేపు (బుధవారం) ఉదయం వరకు వోటింగ్ జరిగే అవకాశాలున్నాయి.