3పార్టీల్నిభూస్థాపితంచేద్దాం, నరసింహావతారమే: కెసిఆర్

ఆ మూడు పార్టీలు తెలంగాణ ద్రోహ పార్టీలే అన్నారు. తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితితో తనకు కొన్ని బేధాభిప్రాయాలు ఉన్న విషయం వాస్తవమే అన్నారు. పాలమూరులో ముస్లిం అభ్యర్థిని నిలబెట్టినప్పుడు జెఏసి మద్దతు ఇవ్వలేదని, అది తనను గాయపర్చిందన్నారు. అందుకే జెఏసితో కొద్దిగా విభేదాలు వచ్చాయని, అయితే మళ్లీ కలిసి ఉద్యమించలేనంత స్థితిలో విభేదాలు లేవని చెప్పారు.
పన్నెండేళ్లుగా హోరాహోరీగా సాగుతున్న ఉద్యమంలో అనేక జయాలు, అపజయాలు వచ్చాయని, పుష్కర కాలం ఉద్యమాన్ని సజీవంగా ఉంచుకున్నామన్నారు. ఈసారి ఎన్నికల ప్రస్థానం కూడా కరీంనగర్ నుండే ప్రారంభమవుతుందన్నారు. కరీంనగర్ గడ్డ ఉద్యమానికి వేయి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. బిజెపితో కూడా కలిసి పని చేసేందుకు తమకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు.
పాలమూరులో పోటీ చేసే సమయంలో బిజెపి ముస్లింలను రజాకార్లతో పోల్చారని ఇది సరికాదన్నారు. ఉద్యమానికి అలాంటి మాటలు పనికి రావన్నారు. అందుకే తాము కలిసి పోవట్లేదని, అది మతవాద పార్టీ అన్నారు. సకల జనుల సమ్మె సమయంలో కొంచెం వెసులుబాటు కల్పించాలని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి చేశారని, అందుకే సడలించామని, ఆ తర్వాత చర్చల కోసం పిలిచారన్నారు. అనేక తర్జన భర్జనల తర్వాత తాను ఢిల్లీకి చర్చల కోసం వెళ్లానన్నారు.
తెలంగాణ కోసం పార్టీని విలీనం చేసేందుకు కూడా తాను సిద్ధపడ్డానని చెప్పారు. అయినప్పటికీ కాంగ్రెసు పార్టీ తాత్సారం చేస్తోందన్నారు. ఇక నుండి కాంగ్రెసుతో ఎలాంటి సంబంధాలు ఉండవన్నారు. కొద్ది నెలలుగా అధిష్టానం తనతో తెలంగాణపై చర్చలు జరిపిందన్నారు. తెరాసకు రెండు పార్శ్వాలు ఉన్నాయని.. ఒకటి ఉద్యమ పార్శ్వం కాగా రెండు రాజకీయ పార్శ్వం అన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులుండవని, ఈ విషయంలో తాము కఠిన నిర్ణయం తీసుకున్నామన్నారు.
బిజెపి, కాంగ్రెసు రెండు పార్టీలో రెండు పెద్ద ప్రాంతీయ పార్టీలే అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని గడరడలాడించారన్నారు. తెలంగాణపై ఇక కాంగ్రెసుకు ఎలాంటి డెడ్ లైన్లు లేవని... ఇక డెత్ లైన్లే అన్నారు. నవంబర్ 29ని దీక్షా దివస్గా ప్రకటిస్తున్నామన్నారు. తాము స్థానిక సమస్యలపై కూడా ఉద్యమిస్తున్నామన్నారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఇవ్వాలని తాను అడిగానన్నారు.
చంద్రబాబు నాయుడు, జగన్ సోదరి షర్మిలలు తమ పార్టీలు అధికారంలోకి వస్తే విద్యుత్ నిరాఘటంగా ఇస్తామని చెబుతున్నారని, రాష్ట్రాన్ని పదిహేనేళ్లుగా పాలించింది వైయస్, చంద్రబాబులే అన్నారు. మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సోనియా గాంధీయే స్వయంగా చెప్పారన్నారు. ఇక అందరూ కెసిఆర్ నరసింహావతారం చూడబోతారన్నారు. తమ ప్రయత్నాన్ని కెసిఆర్ 'ఆరంభించరు నీచమానవులు' అనే పద్యం వినిపించి తెలిపారు.
విజయనగరం, చిత్తూరు జిల్లాల్లో ఉత్సవాలకు కోట్లాది రూపాయలు ప్రకటించిన ప్రభుత్వాలు తెలంగాణకు మణిపూస అయిన కాకతీయ ఉత్సవాలకు మాత్రం స్పందించడం లేదన్నారు. కేవలం వరంగల్ జిల్లా ప్రజల ఒత్తిడి మేరకే ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఉత్సవాల కోసం కేంద్రం కేవలం రూ.25 లక్షలు ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రకటించలేదని విమర్శించారు.
ఈ నెల 15న జరిగే బహిరంగ సభ సమయంలో హరీశ్వర్ రెడ్డి తమ పార్టీలో చేరుతారని చెప్పారు. డిసెంబర్ 9న నల్లజెండాలతో నిరసన తెలియజేస్తామన్నారు. తాము తెలంగాణ ఎప్పటి వరకు రాదో అప్పటి వరకు పోరాటం చేస్తామన్నారు. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు మంచివి కావన్నారు. తెలంగాణ కోసం ఇద్దరు ఎంపీలం వారం రోజుల పాటు లోకసభను అడ్డుకున్నామన్నారు. ఇతర పార్టీలలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు పదుల సంఖ్యలో తనతో టచ్లో ఉన్నారని, అయితే ఎవరిని పడితే వారిని పార్టీలో చేర్చుకోమన్నారు.
తెలంగాణ కోసం దేశంలోని 32 పార్టీలు మద్దతిచ్చాయన్నారు. తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో రాష్ట్ర పునర్నిర్మాణం కూడా అంతే ముఖ్యమన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పునర్నిర్మాణంలో తెరాస ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. తెలంగాణ వాదన చాలా లోతుకు చొచ్చుకు పోయిందన్నారు. గమ్యం ముద్దాడే దాకా విశ్రమించమని, అయితే ఎప్పటి లోగా తెలంగాణ వస్తుందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు.












Click it and Unblock the Notifications