దోచింది దాచుకోవడానికే...: వైయస్ జగన్పై చంద్రబాబు
రాష్టాన్ని పనికి మాలిన ప్రభుత్వం పాలిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. పేదలకు దక్కాల్సిన సొమ్మును కాంగ్రెసు నాయకులు దోచుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో తమ పార్టీ పాలనలోనే అభివృద్ధి పనులు జరిగాయని ఆయన చెప్పుకున్నారు. కాంగ్రెసును గెలిపించి ప్రజలు సుడిగుండంలో చిక్కుకున్నారని ఆయన అన్నారు.
రైతులకు ఖర్చు పెరిగినా ఉత్పత్తులు కొనే నాథుడే లేడని చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఉదయం భాగంగా జిల్లాలోని సల్కలూరు నుంచి 35 వ రోజు పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వంపై నిప్పులు చరిగారు. ప్రభుత్వ విధానాలతోనే రైతులు చితికిపోతున్నారని మండిపడ్డారు. వర్షాకాలంలో కరెంట్ కోతలున్నాయన్నారు. ఒక ఇంటికి రూ.7 వేలు బిల్లు వేస్తే పేదలు ఎలా కడతారని ప్రశ్నించారు.
కరెంటు రాదు, బిల్లు భారం మాత్రం పెరిగిందని చంద్రబాబు అన్నారు. కిరణ్ ఓ చేతకాని సీఎం అని వ్యాఖ్యానించారు. ప్రజలు కష్టాలు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. పిల్ల కాంగ్రెస్లో ఒకరు జైలులో ఉంటే, ఇంకొకరు పాదయాత్ర చేస్తున్నారని, మరొకరు ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించారు. తెలంగాణపై కాంగ్రెస్ దొంగాట ఆడుతుందని విమర్శించారు.
అన్ని పార్టీలూ కాంగ్రెస్లో కలిసిపోయేవే అని, ప్రజల కోసం మిగిలేదని తెలుగుదేశం పార్టీ మాత్రమే అని తేల్చి చెప్పారు. తెలుగుదేశం చచ్చిపోయిందని కొందరు అంటున్నారు, అయితే ఎవరి పార్టీ చచ్చిపోతుందో రాబోయే రోజుల్లో తేలిపోతుందని చంద్రబాబు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు.