2014 ఫియర్: కాంగ్రెస్కు జగన్, బిజెపికి యడ్యూరప్ప
ఈ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలు తమ బలాన్ని పెంచుకునే దిశగా కాకుండా ఇప్పుడు రక్షించుకునే పనిలో పడ్డారు. వారు పడలేదు. ఎపిలో జగన్ కర్నాటకలో యడ్డీ అలా చేశారు. ఎపిలో జగన్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పెట్టడంతో కాంగ్రెసు పార్టీ పూర్తిగా ప్రభ కోల్పోయింది. ఆ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల నాటికి ఆ పార్టీలోను పలువురు మంత్రులతో సహా జగన్కు జై కొట్టనున్నారట.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా జగన్ బాట పడుతున్నారు. తాజాగా నిన్న చింతలపూడి ఎమ్మెల్యే మద్దాల రాజేష్ రాజీనామా సమర్పించారు. సంవత్సరంన్నరగా ఎమ్మెల్యేలు తరుచూ రాజీనామాలు చేస్తూ కాంగ్రెసులో వణుకు పుట్టిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల సమయం వరకు కాంగ్రెసు పార్టీలో ఎంతమంది మిగులుతారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా జగన్ రెడ్డి సామాజికవర్గం కావడంతో ఆ వర్గం వారు జగన్ వైపు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇన్నాళ్లూ కాంగ్రెసుకు అండగా ఉన్న క్రైస్తవులు, ముస్లింలు జగన్కు జై కొడుతున్నారు. సీమాంధ్రలో తన సత్తా చాటిన జగన్ తెలంగాణలోనూ వేళ్లూనుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఉంది. 2014లో కేంద్రంలో యూపిఏ తిరిగి అధికారంలోకి రావాలంటే ఎపి కాంగ్రెసుకు ఎంతో ముఖ్యం. జగన్ భయమే కాకుండా కాంగ్రెసును తెలంగాణ భయం కూడా వెంటాడుతోంది.
ఎపిలో అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఇలా ఉంటే కర్నాటకలో అధికారంలో ఉన్న బిజెపి పరిస్థితి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి అనుచరుడు శ్రీరాములు బిఎస్సార్ పార్టీ పెట్టి బిజెపిలో వణుకు పుట్టించాడు. ఇప్పుడు యడ్యూరప్ప కూడా కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నారు. డిసెంబర్ 9వ తేదిన కొత్త పార్టీ పెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. తనతో చాలామంది ఎమ్మెల్యేలు వస్తారని ఆయన చెబుతున్నారు.
యడ్డీకి దాదాపు అరవై నుండి డెబ్బై మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందట. ఇది బిజెపికి మింగుడు పడకుండా ఉంది. ఒకరో ఇద్దరో ఎమ్మెల్యేలో వెళ్తేనే నష్టమనుకుంటే అంతమంది మంది ఎమ్మెల్యేలు యడ్డీ వెంట ఉన్నారనే విషయం బిజెపి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో యడ్డీని పార్టీ విడిచి వెళ్లకుండా ప్రయత్నాలు ప్రారంభించింది. ఎపిలో రెడ్డి సామాజిక వర్గం జగన్కు జై కొడుతున్నట్లే కర్నాటకలో యడ్డీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. వారు ఆయనకే అండగా నిలుచే అవకాశాలు ఉన్నాయి.
కొసమెరుపు ఏమంటే ఇక్కడ జగన్ అయినా అక్కడ యడ్డీ అయినా టర్మ్ పూర్తయ్యే వరకు ప్రభుత్వాలను పడగొట్టమని, కానీ చాలామంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వారంతా తమకే జై కొడతారని చెబుతున్నారు. ఎమ్మెల్యేల తీరు చూసినా అలాగే కనిపిస్తోంది. పలువురు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే కొందరు సమయం కోసం వేచి చూస్తుండగా మరికొందరు టర్మ్ పూర్తయ్యే వరకు వేచి చూసే ధోరణిలో ఉన్నారు.