చంద్రబాబు యాత్ర: బాడిషె పట్టారు, చేతిపంపు కొట్టారు
జనాభా దామాషా ప్రకారం వచ్చే ఎన్నికల్లో ముస్లిం సామాజికవర్గానికి 15 సీట్లు ఇస్తామని ప్రకటించారు. 'వస్తున్నా..మీకోసం ' పాదయాత్రలో భాగంగా సోమవారం ఆయన రంగారెడ్డిజిల్లా పరిగి నియోజకవర్గంలో యాత్ర కొనసాగించారు. తిమ్మాయిపల్లి, ఊట్పల్లి, రామిరెడ్డిపల్లి గేటు, నారాయణపూర్ గేటు, సుల్తాన్పూర్, పరిగి, హన్మున్గండి మీదుగా ఆయన పాదయాత్ర రంగాపూర్ వరకు కొనసాగించారు. మార్గ మధ్యలో ఆయన రైతులు, విద్యార్థులు, మహిళలను కలిసి వారి సమస్యలను విన్నారు.
తెలుగుదేశం పార్టీపై కొన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని, ప్రజల అండ ఉండగా అవేమీ చేయలేవని ఆయన అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రావాలని తాము సవాల్ విసురుతున్నా ఎవరూ రావడం లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు ముక్కలు తిని ప్రజలకు మెతుకులు వేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డికి వళ్లంతా పొగరేనని వ్యాఖ్యానించారు.
పేదలేమైనా టాటాలూ బిర్లాలా? మీరు వేసే పన్నులకు డబ్బు ఎక్కడ నుంచి తెచ్చి కట్టాలని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. దీపావళి, ఇతర పండుగలను కూడా చేసుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నానా కష్టాలు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ తన తనయుని కోసం హైదరాబాద్ సగాన్ని అమ్మేశారని, ఆయన హయంలో మొదలైన అవినీతి కొనసాగుతుందన్నారు. అసెంబ్లీలో ప్రజల సమస్యలుపై చర్చజరగకుండా కాంగ్రెస్ అడ్డుకుంటుంటే వీరికి టీఆర్ఎస్ వత్తాసు పలుకుతుందని ధ్వజమెత్తారు.
పిల్ల కాంగ్రెస్ వల్ల కూడా ఏమీ జరగదని, ఏ అనుభవం లేకున్నా కొందరు సీఎం పదవి కావాలనుకుంటున్నారని జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నల్గొండలో పిల్ల కాంగ్రెస్ సభ పెడితే ఎవరూ అడ్డుపడరని, అదే తాము పాదయాత్ర చేస్తే అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశాన్ని లేకుండా చేసి భూస్వాములు, పెత్తందార్లు రాజ్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
కొన్ని పార్టీలకు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నందునే పాదయాత్ర అడ్డుకోవాలనుకుంటున్నారని అన్నారు. సకల జనుల సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల కోసం తాము అధికారంలోకి వస్తే కొత్త పాలసీని తీసుకువస్తామని చెప్పారు. ఆర్టీసీని తాము ప్రైవేటు పరం కాకుండా కాపాడతామని తెలిపారు. గీత కార్మికులకు జీవిత కాల లైసెన్స్ ఇస్తామని చెప్పారు. ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో ఇస్తామని తెలిపారు.
జనాభా దామాషా ప్రకారం వచ్చే శాసనసభ ఎన్నికల్లో ముస్లింలకు 15 సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా రూ.2500 కోట్లతో వారి కోసం బడ్జెట్ ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. మసీదు నిర్మించుకోవడం కోసం రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చా రు. ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే రూ. 50 వేలతో పాటు షాదిఖానల నిర్మాణం కోసం రూ. 15 లక్షలు కేటాయిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా, పరిగి నియోజకవర్గ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ గూటికి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న హరీశ్వర్రెడ్డికి అత్యంత అనుబంధం కలిగిన ఆయన తాత ఊరు ఊట్పల్లి గ్రామాన్ని చంద్రబాబు కలియదిరిగారు. సోమవారం ఉదయం 11.17 గంటలకు తిమ్మాయపల్లి నుంచి పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు ఊటుపల్లిలో వీధి వీధినా తిరిగారు. 30 కుటుంబాలతో మాట్లాడారు. గ్రామంలో గొల్ల బాలయ్య ఇంటికి వెళ్లగా గొంగళి, మేక పిల్లను బహూకరించారు.
రాంచంద్రయ్య అనే వడ్రంగి వద్దకు వెళ్లి కష్టాలు తెలుసుకున్నారు. పెద్ద బాడిషాతో పాలెను చెక్కి చూపించారు. గొల్ల ఎల్లయ్య మందను చూసి మేకల పెంపకం ఎలా ఉందని అడిగారు. గొర్రెల కన్నా పాడి పశువులను పోషించుకుంటే లాభసాటిగా ఉంటుందని సలహా ఇచ్చారు. సాక్షరభారతి ఆధ్వర్యంలో నడుస్తున్న కుట్టు శిక్షణ కేంద్రాన్ని సందర్శించి మహిళలను ఆరా తీశారు. మైసమ్మ దేవాలయంలో పూజలు చేశారు. తాగునీటి సమస్య అధికంగా ఉందని మహిళలు చెప్పడంతో ఓ చేతి పంపును కొట్టి నీళ్లను పరిశీలించారు.