2034 వరకు ముఖ్యమంత్రి నేనే.. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా - సీఎం రేవంత్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలతో హాట్ టాపిక్ గా మారారు. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని.. ఆ తర్వాత యువతకు అవకాశాలు కల్పిస్తాం అని తెలిపారు. తెలంగాణను పెట్టుబడుల కేంద్రంగా, ఉపాధి అవకాశాల హబ్గా మార్చేందుకు ప్రభుత్వం పని చేస్తోందని వివరించారు. అలానే ఒకవైపు కాంగ్రెస్ భవిష్యత్ వ్యూహాలపై మాట్లాడుతూనే.. మరోవైపు బండి సంజయ్ కుటుంబ వ్యవహారంపై ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది.
జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా..
కాగా రాహుల్ గాంధీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తాను కూడా జాతీయ స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. దేశానికి అవసరమైతే తన అనుభవాన్ని పంచుకుంటానని, రాహుల్ గాంధీ అప్పగించే ఏ బాధ్యతనైనా స్వీకరించడానికి సిద్ధమని చెప్పారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. రాష్ట్రాన్ని దేశ జీడీపీలో 10 శాతం వాటా కలిగిన శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. గాంధీ కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, పార్టీ క్రమశిక్షణను ఎప్పుడూ దాటబోనని స్పష్టం చేశారు. దేశాన్ని ఏకం చేసే నాయకత్వం రాహుల్ గాంధీకి ఉందని చెప్పారు. మొదట ఆయనకు ప్రధాని కావాలన్న ఆసక్తి లేకపోయినా, దేశ పరిస్థితులు చూసి బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. వికారాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో తానే రాహుల్ను ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావాలని కోరినట్లు తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 'ఇండియా' కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
రాజకీయ ఒత్తిళ్లకు తావుండదు..
కాగా తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసుపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ రాజకీయ జీవితాన్ని ప్రస్తావిస్తూ, కిందిస్థాయి కార్యకర్తగా ప్రారంభమై కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడిగా ఆయనను అభివర్ణించారు. అయితే ఇప్పుడు కుమారుడి వ్యవహారం వల్ల ఆయనకు తలవంపులు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా ఎలాంటి కేసు వచ్చినా చట్టాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. పారిపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావు అని స్పష్టం చేశారు. బండి భగీరథ్ అదృశ్యమవడం లేదా పోలీసులకు అందుబాటులో లేకపోవడం సరైన చర్య కాదని పేర్కొన్నారు. తండ్రిగా, ప్రజాప్రతినిధిగా బండి సంజయ్ బాధ్యత తీసుకుని తన కుమారుడిని స్వయంగా పోలీసులకు అప్పగిస్తే ఆయన గౌరవం మరింత పెరుగుతుందని సూచించారు. తప్పు చేశాడా లేదా అనేది విచారణలో తేలుతుంది. కానీ ముందు చట్టానికి లొంగి సమాధానం చెప్పే ధైర్యం ఉండాలి" అని సీఎం అన్నారు. రాజకీయ నాయకుల కుటుంబ సభ్యులైనా, సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తారని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావుండదని తెలిపారు.
🚨🚨🚨🚨
— H A N U (@HanuNews) May 15, 2026
జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ CM రేవంత్ రెడ్డి.
2034 వరకు తెలంగాణా CM గా నేనే ఉంటాను. 2034 లో కాంగ్రెస్ ను గెలిపించి, జాతీయ రాజకీయాల్లోకి వెళ్తాను - రేవంత్ రెడ్డి pic.twitter.com/yYkVSst3sr
చంద్రబాబుతో ఇప్పటికీ సత్సంబంధాలు..
తాను గతంలో పదేళ్లపాటు టీడీపీలో పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్న సీఎం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికీ తనను గౌరవిస్తారని చెప్పారు. పార్టీలు మారినా వ్యక్తిగత సంబంధాలు కొనసాగడం రాజకీయాల్లో చాలా అరుదని వ్యాఖ్యానించారు. టీడీపీని వీడే సమయంలో విజయవాడ వెళ్లి చంద్రబాబుకు స్వయంగా చెప్పి వచ్చినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రజలు "స్విగ్గీ పాలిటిక్స్" కోరుకుంటున్నారని, వేగంగా ఫలితాలు ఇచ్చే రాజకీయ నాయకత్వాన్ని ఆశిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications