బుజ్జగింపులు: కెకెతో పల్లంరాజు, కావూరికి పిఎం పిలుపు
రాష్ట్రంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు దృష్టి సారించిన నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించినట్లు తెలుస్తోంది. పల్లంరాజు మంగళవారం మధ్యాహ్నం దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోని నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు ఇతర పార్టీల్లోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పల్లంరాజు కేశవరావుతో సమావేశమయ్యారు.
తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పార్టీని వీడకుండా చూడాలని పల్లంరాజు కేశవరావుకు సూచించినట్లు సమాచారం. తెలంగాణ సమస్యపై అధిష్టానం దృష్టి పెట్టిందని, నిర్ణయం తీసుకునే వరకు ఎటువంటి తీవ్ర చర్యలకు దిగవద్దని పల్లంరాజు సూచించినట్లు సమాచారం. అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని, పార్లమెంటు సభ్యులతో మాట్లాడి చెప్తానని కేశవ రావు అన్నట్లు సమాచారం.
తెలంగాణకు వ్యతిరేకంగా ఒకవేళ కేంద్రం నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఆలోచించుకోవాలని, ప్రస్తుతానికి పార్టీని వీడకుండా చూడాలని పల్లంరాజు చెప్పినట్లు సమాచారం. రాహుల్ గాంధీ సూచన మేరకే పల్లంరాజు కేశవ రావుతో సమావేశమైనట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కకపోవడంతో తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాసిన ఏలూరు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావుకు ప్రధాని మన్మోహన్ సింగ్ నుంచి పిలుపు అందింది. రేపు సాయంత్రం ఆరున్నర గంటలకు తనను కలవాలని మన్మోహన్ సింగ్ కావూరికి సమాచారం అందజేసినట్లు సమాచారం. దీంతో కావూరి సాంబశివ రావు రేపు బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశాలున్నాయి.
కాగా, కావూరి సాంబశివరావుకు ఎఐసిసిలో స్థానం కల్పించే అవకాశాలున్నాయి. పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి)లో ఆయనకు చోటు కల్పిస్తారని అంటున్నారు. ప్రధాని ఇదే విషయాన్ని కావూరికి చెబుతారని అంటున్నారు. అయితే, తనకు పార్టీ పదవి అవసరం లేదని కావూరి మొండికేస్తున్నారు.