షర్మిల యాత్ర: ఊరడింపులు, పలకరింపులు, ముచ్చెట్లు
స్కూలుకు వెళ్తున్నావా చిన్నా అని షర్మిల అడగ్గానే ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఐదో తరగతి వరకు చదువుకున్నానని, ఈ ఏడాదే చదువు మానేశానని, తల్లిదండ్రులిద్దరూ బండలు కొట్టే పనిచేస్తారని, తనను చదివించలేరని ఏడ్చింది. దీంతో చలించిపోయి షర్మిల... పాప, నాయనమ్మల కన్నీళ్లు తుడుస్తూ నేను చదివిస్తానమ్మా అంటూ ఓదార్చారు. ఆలూరు నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మనూరు జయరాం ఆ పాపను చదివించేందుకు ముందుకొచ్చారు. పాపను స్కూల్లో చేర్పిస్తానని మాటిచ్చారు.
ఆరోగ్యశ్రీ ద్వారా గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారు విరూపాపురం సభలో షర్మిలను కలిసి మాట్లాడారు. వైయస్ ప్రవేశపెట్టిన పథకం ద్వారానే తాము జీవించి ఉన్నామంటూ ఆనందం పంచుకున్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో వ్యాధులను తీసేసి.. సామాన్యులను మళ్లీ ప్రభుత్వాసుపత్రికి పొమ్మంటోంది. ఇలాంటి సర్కారును అవిశ్వాసం పెట్టి దించేయకుండా చంద్రబాబు పాదయాత్రలంటూ డ్రామాలాడుతున్నారు. వాళ్లకు విశ్వసనీయత లేదని మరోసారి నిరూపించుకున్నారు' అని అన్నారు.
‘‘ఇచ్చే నాలుగు గంటల కరెంటుకు రూ.250 బిల్లు వేస్తున్నారట! మూడేళ్లలో మూడుసార్లు చార్జీలు పెంచిన ఈ ప్రభుత్వం.. మూడేళ్ల కిందటి సర్చార్జీలు ఇప్పుడు వసూలు చేస్తూ పేదోళ్ల బతుకుల్లో చీకటి నింపుతోంది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు విద్యుత్తు కోతల్లేకుండా కరెంటు బిల్లు రూ.50 వస్తే.. ఇప్పుడు మొత్తం కోతలతోనే రూ.250 రావడం ఏ రకంగా న్యాయం. ఇది రాబందుల రాజ్యం కాదా..?'' అని షర్మిల విరుచుకుపడ్డారు. బిణిగేరి గ్రామవాసులతో ముచ్చటపెడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
బస్ చార్జీలు, కరెంటు చార్జీలు, గ్యాస్ చార్జీలు ఎడాపెడా పెంచేసి ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. వైఎస్ ఉన్నప్పుడు కరెంటు అవసరాలను ముందే ఊహించి కొనుగోలు చేసేవారని, ఈ ముఖ్యమంత్రి మాత్రం నిద్రపోతున్నారన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలకు నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం సోమవారం 26వ రోజు కర్నూలు జిల్లా ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో సాగింది.