'జనరల్' టెన్షన్: 'ముందస్తు'కు జగన్, కెసిఆర్ ఆరాటం

కాంగ్రెసు, టిడిపిల పరిస్థితి బాగాలేని ఈ సమయంలోనే ఎన్నికలు జరిగితే బాగుంటుందని గులాబి దళపతి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధిపతి భావిస్తున్నారు. 2014 వరకు పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన కెసిఆర్, జగన్లను పట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెసు పరిస్థితి ఇప్పటికీ బాగా లేకున్నా అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగవచ్చుననే భావన వారిలో కనిపిస్తోందని అంటున్నారు.
ఒకవేళ కాంగ్రెసు పార్టీకి అంత సీన్ లేకపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీ క్రమంగా పుంజుకోవడం వారిలో ఆందోళనకు కారణమట. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో టిడిపి నేతలు తిరిగేందుకే సాహసించలేని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రభంజనం సృష్టిస్తున్నారు. అయితే ఇప్పటికి ఇప్పుడు వచ్చిన ఇబ్బంది తెరాసకు గానీ, వైయస్సార్ కాంగ్రెసుకు గానీ ఏమీ లేదు.
ఇప్పుడు కొంత మాత్రమే పుంజుకున్నదని, ఇలాగే మరికొద్ది కాలం ఉంటే తమకు ఎదురు దెబ్బ తగలడం ఖాయమని ఆ పార్టీ అధ్యక్షులు భావిస్తున్నారట. టిడిపిలో బాలకృష్ణ, నారా లోకేష్ వంటి వారు క్రియాశీలకంగా మారితే మరికాస్త ఇబ్బంది కలగక మానదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం టిడిపి గానీ, బాలకృష్ణ, లోకేష్ల ప్రభావం కానీ అంతగా ఉండదని జగన్, కెసిఆర్లు భావిస్తున్నారని చెబుతున్నారు.
తాము టార్గెట్ చేసిన పార్టీలు పుంజుకోకముందే ఎన్నికలు రావాలని వారు కోరుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే సీమాంధ్రలో జగన్ బాగా వేళ్లూనుకున్నారు. అయితే ఇదంతా సెంటిమెంట్ కారణంగానే అనే వాదన ఉంది. ఈ సెంటిమెంట్ తగ్గక ముందే తన సత్తా చాటాలని జగన్ భావిస్తున్నారట. అదే సమయంలో తెలంగాణలో పరకాల ఉప ఎన్నికలు ఆయనకు కొత్త ఉత్సాహన్ని నింపాయని అంటున్నారు.
తెరాస ఎక్కువ సీట్లు గెలుచుకున్నప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తాము కూడా తెరాసకు ధీటుగా సీట్లు గెలుచుకోగలమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. అదే సమయంలో కెసిఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెరాస ఖచ్చితంగా 70 నుండి 80 సీట్లు గెలుచుకుంటుందనే భావనతో ఉన్నారట. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చునని ఆయన భావిస్తున్నారట.
ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తెరాస కీలకంగా మారాలంటే సాధ్యమైనంత త్వరగా ముందస్తు ఎన్నికలు జరగాలని 2014కు ఆగితే సాధారణ ఎన్నికల్లో సెంటిమెంట్ ప్రభావం అంతగా చూపదనే వాదనతో తెరాస కూడా ఏకీభవిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. జగన్ కూడా 2014లో ఎన్నికలు జరిగితే సెంటిమెంట్ ప్రభావం తగ్గుతుందనే ఆందోళనతో ఉన్నారట. ప్రస్తుతం ఓ ఊపు మీదన్న జగన్, కెసిఆర్లు ముందస్తు ఎన్నికలకు ఉవ్వీళ్లురూతుండగా... పరిస్థితి బాగా లేని టిడిపి, కాంగ్రెసులు మాత్రం అందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications