క్లైమాక్స్: చిత్తూరు కుంపటి, కిరణ్ రెడ్డికి గండం వీరేనా?
నవంబర్ 30వ తేదీలోగా కిరణ్ కుమార్ రెడ్డిని మార్చకపోతే తాము తీవ్ర చర్యలకు దిగుతామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాకు చెందిన శాసనసభ్యుల్లో పేరుకుపోయిన అసంతృప్తిని ఆసరా చేసుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది. దాంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారిందనే ప్రచారం సాగుతోంది.
మజ్లీస్ మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ బలం శానససభలో 153కు పడిపోయింది. బలనిరూపణకు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య 148. పరిస్థితి చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుత కాంగ్రెసు సభ్యులు ఎంత మంది కిరణ్ కుమార్ రెడ్డి వైపు నిలబడుతారు, ఎంత మంది ప్లేటు ఫిరాయిస్తారనేది కూడా చెప్పలేని సందిగ్ధావస్థ.
చింతలపూడి శాసనసభ్యుడు మద్దాల రాజేష్, ఏలూరు శాసనసభ్యుడు ఆళ్ల నాని, బొబ్బిలి శాసనసభ్యుడు సుజయ కృష్ణ రంగారావు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అయితే, వారి రాజీనామాను ఇంకా స్పీకర్ ఆమోదించలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, ఆ ముగ్గురు శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆమోదించవచ్చు. ఆ ముగ్గురిని పక్కన పెడితేనే కాంగ్రెసు బలం శాసనసభలో 153 ఉంది.
రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే, కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత అని కాకుండా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల కాస్తాకూస్తో అనుకూలంగా ఉన్న శాసనసభ్యుల సంఖ్య దండిగానే ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే వారు ప్రభుత్వం వైపు గట్టిగా నిలబడుతారని చెప్పడానికి వీలు లేని స్థితి ఉంది. చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వ్యతిరేకించడానికి సిద్ధంగానే ఉన్నారు. కుతూహలమ్మ(గంగాధర నెల్లూరు), సికె బాబు (చిత్తూరు), షాజహాన్ బాషా (మదనపల్లి), రవి (పూతలపట్టు) కచ్చితంగా కాంగ్రెసు ప్రభుత్వం వైపు నిలబడతారనేది చెప్పడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి (నంద్యాల) పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి బాటలోనే నడుస్తారని అంటున్నారు.
మాజీ మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి (మైదుకూరు), పి. శంకరరావు (సికింద్రాబాద్ కంటోన్మెంట్) ముఖ్యమంత్రిపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. అధిష్టానం ఆదేశాలను పాటిస్తానని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. వీరిద్దరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారని చెప్పడానికి లేదు. సికింద్రబాదు శాసనసభ్యురాలు జయసుధ ఓసారి వైయస్ జగన్ వైపు వెళ్లి కాంగ్రెసులోకి తిరిగి వచ్చారు. కుత్బుల్లాపూర్ స్వతంత్ర శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్ ఏ నిర్ణయమైన తీసుకోవచ్చు. నల్లగొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ) తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఆ జిల్లాకు చెందిన కాంగ్రెసు సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పదేపదే చెబుతున్నారు. అదే జిల్లాకు చెందిన ఆర్. దామోదర్ రెడ్డి (సూర్యాపేట) సంతృప్తిగా లేరని అంటారు.
ఉగ్రనరసింహా రెడ్డి (కనిగిరి), కాటసాని రాంభూపాల్ రెడ్డి (పాణ్యం), కాటసాని రాంరెడ్డి (బనగానపల్లి) కూడా కిరణ్ కుమార్ రెడ్డికి అండగా నిలుస్తారా అనేది చూడాల్సే ఉంది. రేగా కాంతారావు (పినపాక). కుంజా సత్యవతి (భద్రాచలం), కొర్ల భారతి (టెక్కలి), జయమణి (పార్వతీపురం) కూడా అటో ఇటో చెప్పలేని స్థితి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి (కాకినాడ అర్బన్) కచ్చితంగా వైయస్ జగన్ వైపే ఉండే అవకాశం ఉంది. తాను జగన్ వైపు ఉంటానని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఈ రకంగా చూస్తే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది.