క్షమించరాని వ్యాఖ్యలు: కోదండరాంపై గీతా రెడ్డి నిప్పులు
తెలంగాణవాదులు ఎవరూ తనను వ్యతిరేకించడం లేదన్నారు. ఆయన మాటల తీరును చూసి అందరూ అసహ్యించుకుంటున్నారన్నారు. మంత్రి జానా రెడ్డి నాయకత్వంలో తాము తెలంగాణ కోసం పని చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఏం చేయాలో తమకు తెలుసునన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కోదండరామ్ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ జెఏసి చెప్పినట్లుగా తాము నడుచుకోబోము అన్నారు. ఆయన వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. పవిత్రమైన ప్రొఫెసర్ వృత్తిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అని ప్రశ్నించారు. దళిత మంత్రిని అయిన తనను విమర్శించడం హేయమన్నారు. తన గురించి తన తల్లి గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదన్నారు. ఆయనది ఫ్యూడలిస్ట్ మెంటాలిటీ అని, పెత్తందారీ వ్యవస్థ కోసమే ఆయన పని చేస్తున్నట్లుగా ఉందన్నారు.
కోదండరామ్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటే తాను మొదట నమ్మలేదని, కానీ వీడియో చూశాక నమ్మక తప్పలేదన్నారు. తెలంగాణ కోసం తాము ఢిల్లీకి వెళ్లి తమ పార్టీ పెద్దలను కలిశామన్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చామన్నారు. తెలంగాణ కోసం తాము ఇంతగా చేస్తుంటే ఆయన మతిమరుపుతో మాట్లాడుతున్నారా అన్నారు. రూలింగ్ పార్టీ మంత్రిగా తనకు కొన్ని పరిమితులు ఉంటాయన్నారు.
తన తల్లి తెలంగాణ కోసం జైలుకు వెళ్లారని, లాఠీ దెబ్బలు తిన్నారన్నారు. ఆమె తెలంగాణ కోసం రాష్ట్రం కోసం ఎంతగానో చేశారన్నారు. ఆమెకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎలాంటి పరిమితులు ఉండకపోగా తనకు రూలింగ్ పార్టీ నేతగా కొన్ని పరిమితులు ఉంటాయన్నారు. తమ పరిధిలో తాము తెలంగాణ కోసం కృషి చేస్తామన్నారు.