జగన్ యాక్షన్ ప్లాన్: మజ్లిస్ - వైయస్సార్సీ ఒకరికొకరు
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆయన తనదైన శైలీలో అధికార కాంగ్రెసు, ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలపై యాక్షన్ ప్లాన్కు సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు కాంగ్రెసు, టిడిపి ప్రజా ప్రతినిధులపై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తూనే టిడిపి, కాంగ్రెసు క్రిస్టియన్ ఆరోపణలకు మజ్లిస్తో కౌంటర్ ఎటాక్ చేశారని అంటున్నారు.

ముందస్తు ఎన్నికల కోసం అర్రులు చాస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి మజ్లిస్ పార్టీ అసంతృప్తిని వినియోగించుకుంటున్నారని అంటున్నారు. గతంలో మజ్లిస్ నేత అక్బరుద్దీన్ ఓవైసీ తమ పార్టీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే ఉద్దేశ్యంలో భాగంగా రాయలసీమలో పర్యటించారు. అదే సమయంలో కాంగ్రెసు పార్టీ మజ్లిస్కు రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చే పరిస్థితి లేదు. దీనిని గమనించిన జగన్ చంచల్గూడ జైలులో రాష్ట్రపతి ఎన్నికల సమయంలో తనను కలిసేందుకు వచ్చిన అసదుద్దీన్ ఓవైసీతో ప్రణబ్ ముఖర్జీ అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలపై కూడా చర్చించారని అంటున్నారు. కొత్తగా పెట్టిన తన పార్టీకి మైనార్టీల అండ ఉండటం కోసం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మజ్లిస్కు ప్రాధాన్యత ఇచ్చేందుకు జగన్ ముందుకు వచ్చారట. అందుకే మజ్లిస్ కాంగ్రసుకు దూరమై క్రమంగా జగన్కు దగ్గరైందని అంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ గత కొంతకాలంగా జగన్ పార్టీపై మతతత్వ రాజకీయాలు అంటూ విరుచుకుపడింది. వైయస్ విజయమ్మ పలు రాజకీయ కార్యక్రమాల్లో బైబిల్ పట్టుకోవడాన్ని టిడిపి ప్రశ్నించింది. తమపై క్రైస్తవ అనుకూల ముద్ర వేయడంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా మజ్లిస్తో చేతులు కలిపి ముస్లింలను తమ వైపుకు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు. సాధారంగా మైనార్టీ వర్గాలు మూకుమ్మడిగా ఒక వైపే ఓట్లు వేస్తారనే వాదన ఉంది. ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు తమ వైపు ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఏమంత కష్టం కాదని జగన్ పార్టీ భావిస్తుండవచ్చునని అంటున్నారు. ఇప్పటికే క్రైస్తవులు జగన్కు మద్దతు పలుకుతున్నారు. తాజాగా మజ్లిస్ తమ వైపు రావడం ద్వారా ముస్లింల ఓట్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా తమకే పడతాయని జగన్ పార్టీ బలంగా భావిస్తోందని అంటున్నారు.

ఇక ఇన్నాళ్లూ పాతపట్నంకే పరిమితమైన మజ్లిస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీని విస్తరించాలని చూస్తోంది. ప్రస్తుతం ఆ పార్టీకి 1 ఎంపీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనిని రెండు ఎంపీలు, పదిహేను అసెంబ్లీ సీట్లకు 2014 ఎన్నికల్లో పెంచుకోవాలని చూస్తున్నారట. అందులో భాగంగానే జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. పాతబస్తీకే పరిమితం అయిన మజ్లిస్కు రాష్ట్రవ్యాప్తంగా మద్దతిచ్చేందుకు కాంగ్రెసు వెనక్కి పోయి ఉంటుందని, కొత్త పార్టీ పెట్టిన జగన్ మాత్రం సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. మజ్లిస్ జగన్ వైపు వస్తే ఇరువురికి లాభమే. కాబట్టి కలిసి పని చేసేందుకు వారి మధ్య ఎప్పుడో ఒప్పందం కుదిరిపోయిందని అంటున్నారు. కాంగ్రెసుకు దూరం కావడానికి మజ్లిస్ భాగ్యలక్ష్మి ఆలయం అంశాన్ని ఉపయోగించుకుందని అంటున్నారు.

జగన్ ఓ వైపు అధికార కాంగ్రెసు పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులను తన వైపుకు రప్పించుకుంటూనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎసరు పెట్టేందుకు పావులు వేగంగా కదుపుతున్నారని అంటున్నారు. కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టేందుకు కూడా జగన్ సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి.
సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరంన్నర మాత్రమే ఉంది. దీంతో జగన్ తన వ్యూహానికి మరింత పదును పెట్టినట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగా గతంలో కంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి గురి చేసేందుకు పావులు కదుపుతున్నారని అంటున్నారు. సాధారణ ఎన్నికల వరకు ఆగకుండా ముందస్తు ఎన్నికలు వస్తేనే మంచిదనే భావనతో జగన్ ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. అందుకోసం వేగంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications