శివసేన చీఫ్ బాల్ థాకరే ఆరోగ్యం ఆందోళనకరం
థాకరే ఆరోగ్యం గత కొంతకాలంగా ఆందోళనకరంగా ఉంటోంది. ఇతను అప్పటి నుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. థాకరే శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లు ఆయన ఇంటి వద్దనే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గత నెలలో ఆయన పార్టీ నిర్వహించే దసరా కార్యక్రమానికి, ర్యాలీకి హాజరు కాలేదు. ఆయన దసరా ర్యాలీకి ముంబయిలో ఎప్పుడూ హాజరవుతుంటారు. కానీ ఈసారి మాత్రం గైర్హాజరయ్యారు.
అయితే వీడియో రికార్డ్ ద్వారా కార్యకర్తలకు ఆయన తన సందేశాన్ని అందించారు. థాకరే ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పలువురు నేతలు ఆయన ఇంటికి తరలి వచ్చారు. మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సహా పలువురు థాకరేను చూసేందుకు వచ్చారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను, కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ తరలి వచ్చారు. దీంతో థాకరే ఇంటి వద్ద పటిష్ట పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. థాకరే ఇంటి వద్దే ఆయనకు వైద్య బృందం వైద్య సేవలు అందిస్తోంది.