అవసరమైతే అవిశ్వాసం: జగన్ పార్టీకి బాబు రిప్లై

ఇతర పార్టీలు బేరాసారాలు చేసుకోవడానికి, బ్లాక్ మెయిల్ చేసి కేసుల నుంచి బయటపడడానికి తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించబోమని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని ఓడించి, ఆ పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చూస్తే కాంగ్రెసు ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని, తమ పార్టీ అధికారంలో ఉంటే ఆ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఉండేదని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీకి ఒక్క రోజు కూడా పాలించే అర్హత లేదని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని, ఇప్పుడు అవసరమైతే ప్రజా సమస్యలపై అవిశ్వాసం ప్రతిపాదిస్తామని ఆయన అన్నారు. అవిశ్వాసంతో బ్లాక్ మెయిలింగ్ కుదరదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుంచి వస్తున్న డిమాండ్కు ప్రతిస్పందనగా ఆయన అవిశ్వాసం తీర్మానం ప్రతిపాదించే విషయంపై మాట్లాడారు.
అవిశ్వాసం ఎప్పుడు పెడతారో తెలియని వారు దాని గురించి మాట్లాడుతున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని అడుగుతున్నారని చంద్రబాబు అన్నారు. శానససభా సమావేశాలు జరుగుతున్నప్పుడే అవిశ్వాసం ప్రతిపాదిస్తారనే విషయం కూడా వారికి తెలియదా అని ఆయన అడిగారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నవారు గవర్నర్ వద్దకు వెళ్తే మంచిదని ఆయన అన్నారు.
మజ్లీస్ మద్దతు ఉపసంహరణతో ప్రభుత్వం మైనారిటీలో పడిపోయిందని, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే ప్రభుత్వం కూలిపోతుందని, ప్రభుత్వం కూలిపోకుండా చంద్రబాబు కాపాడుతున్నారని, అందుకే అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడానికి చంద్రబాబు ముందుకు రావడం లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పదే పదే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కుమ్మక్కయిందని వారు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications