షర్మిల యాత్ర: పరిటాల సునీతపై జోరుగా బెట్టింగ్స్
రాప్తాడులోనూ షర్మిలకు జనం నీరాజనాలు పట్టారు. షర్మిల పాదయాత్ర చేయడంతో రాప్తాడులో తమ దశ తిరుగుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భావిస్తున్నారట. అంతేకాదు పరిటాల సునీత గెలుపోటములపై బెట్టింగ్స్ కూడా కాశారట. సాధారణ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయమున్నందున అప్పుడే బెట్టింగ్స్ ఏమిటంటే... అనంతపురం జిల్లాలో పరిటాల కుటుంబానికి ఉన్న ఇమేజ్ కారణంగానే అంటున్నారు.
పరిటాల రవి ఉన్నప్పుడు అనంతపురం జిల్లాలో ఆయనదే హవా. ఆయన మృతి తర్వాత కూడా అనంతపురం జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు పరిటాల కుటుంబాన్ని ఆదరిస్తున్నారు. రాప్తాడులో అయితే ఆ కుటుంబానికి తిరుగు లేదు. దీంతో మిగిలిన నియోజకవర్గాల కంటే రాప్తాడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎక్కువ దృష్టి సారించిందని అంటున్నారు. షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపించింది.
రాప్తాడులో తిరుగులేని పరిటాల కుటుంబానికి వచ్చే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలక తప్పదని ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారట. షర్మిల పాదయాత్రతో అది రుజువైందని, ఇప్పటి నుండే పార్టీ కోసం కష్టపడితే సునీతను ఓడించడం పెద్ద కష్టం కాదని భావిస్తున్నారట. అందులో భాగంగా ఇప్పటి నుండే బెట్టింగ్స్ ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. అయితే రాప్తాడులో సునీతను ఓడించడం కష్టమైన పనే అని మరికొందరు అంటున్నారు. అయితే షర్మిల యాత్ర ఊఫు నేపథ్యంలో ఇప్పుడే బెట్టింగ్స్కు దిగడం గమనార్హం.