ట్రబుల్ షూటర్: వెంకయ్య నాయుడికి బిజెపి పగ్గాలు?
పైగా, పార్టీ అధ్యక్ష పదవి అంటే, భావి ప్రధాని పగ్గాలు చేపట్టే నేతగా ముందుకు రావడమేననే అభిప్రాయం బలంగా ఉండడంతో పలువురు అగ్రనేతలు ఆ పదవికి పోటీ పడుతున్నారు. అదే సమయంలో వివిధ గ్రూపులు తమ తమ గ్రూపుల ఆధిపత్యానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ స్థితిలో వెంకయ్య నాయుడిని ముందు పెడితే ఆ సమస్య పరిష్కారమవుతుందని ఆర్ఎస్ఎస్ వర్గాలు కూడా భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుత అధ్యక్షుడు నితిన్ గడ్కరీ క్విడ్ ప్రో కో అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవి నుంచి ఆయన తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయనను తప్పించే విషయమై పార్టీలోనూ చర్చ జరుగుతోంది. గడ్కరీ ఎలాంటి తప్పూ చేయలేదని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త గురుమూర్తి సమర్థించినా.. ఒక వ్యాపారవేత్త పార్టీ అధ్యక్షుడైతే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని బీజేపీ సీనియర్లు, ఆర్ఎస్ఎస్ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో డిసెంబర్ మూడో వారంలో జరిగే పార్టీ జాతీయ మండలి సమావేశంలో గడ్కరీ తనంతట తాను తప్పుకునేందుకు అవకాశం కల్పిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈలోపులోనే, భావి నాయకత్వంపై పార్టీ నేతలు, సంఘ్ పెద్దలు ఒక నిర్ణయానికి రావచ్చునని, ఇప్పటికే ఈ దిశగా అంతర్గత చర్చలు ప్రారంభమయ్యాయని తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సీనియర్ నేతలు వెంకయ్యనాయుడు, రాజ్నాథ్ సింగ్, శాంతకుమార్ పేర్లు పరిగణనలోకి వచ్చినా, సంస్థాపరంగా నిర్వహణ సామర్థ్యం కలిగిన వెంకయ్య వంటి నేత ప్రస్తుతం అవసరమని బిజెపి, సంఘ్ పెద్దలు భావిస్తున్నట్లు తెలిసింది.
గత నాలుగు దశాబ్దాలుగా సంఘ్తో సంబంధాలున్న వెంకయ్య ఇటు పార్టీకి, అటు సంఘ్కు విధేయంగా ఉంటారని, రెండింటికీ వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఎప్పుడూ లేవని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పార్టీ కోరినప్పుడు కేంద్రంలో కేబినెట్ పదవి సైతం వదులుకుని 2002-04 మధ్య పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వెంకయ్య అధ్యక్షుడుగా ఉన్నంతకాలం ఎలాంటి వివాదాలు తలెత్తలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.