హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీలోకి జంప్స్: 70మంది ఎమ్మెల్యేలు సిద్ధమా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకుంటున్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. గత కొన్నాళ్లుగా తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా జగన్ వైపుకు వెళ్తున్నారు. అప్పుడొకరు అప్పుడొకరు ఆయనకు జై కొట్టారు. కానీ ముందస్తు ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఆ జోరు ఒక్కసారిగా పెరిగిందనే చెప్పవచ్చు.

ఈ నాలుగు రోజుల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుండి చాలామంది నేతలు జగన్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జగన్‌కు జై కొడతానని చెప్పారు. ఈ నెల 23న చంచల్‌గూడ జైల్లో జగన్‌ను కలుసుకొని పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ కాంగ్రెసుతో పోరాడటంతో ఆ పార్టీలో చేరలేక వైయస్సార్ కాంగ్రెసులో చేరాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.

ఇన్నాళ్లు జగన్ పార్టీలో చేరతారనే వార్తలను కొట్టి పారేస్తూ వచ్చిన నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి సోదరులు కూడా జగన్ వైపు వెళ్లే సంకేతాలు ఇచ్చారు. భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదివారం మాట్లాడుతూ... తమకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రత్యేకమైన అభిమానమని, డిసెంబర్ 9వ తేది లోగా తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోకుంటే రాజీనామా చేసేందుకు సిద్దమన్నారు. అవసరమైతే జగన్‌కు అండగా నిలబడతామన్నారు.

కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఏ క్షణంలోనైనా జగన్ పార్టీలో చేరవచ్చునని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరే విషయాన్ని ఆయన కొట్టి పారేయడం లేదట. పైగా వైయస్ అంటే తమకు అభిమానమని, ఆయనే తనకు టిక్కెట్ ఇచ్చి ఆదరించారని చెబుతున్నారట. ఆయన వ్యాఖ్యలను గమనిస్తున్న వారు త్వరలో జగన్ పార్టీ తీర్థం తీసుకుంటారని చెబుతున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన జలగం వెంకట్రావు సోమవారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన టిడిపి నేత సంకినేని వెంకటేశ్వర రావు ఇటీవలే సూర్యాపేటలో జరిగిన బహిరంగ సభలో జగన్ పార్టీలో చేరిపోయారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో పలమనేరు, తంబళ్లపల్లి శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ రెడ్డిలు తాము జగన్ పార్టీలోకి వెళుతున్నట్లు ఆదివారం మీడియా సమక్షంలో ప్రకటించారు. చిత్తూరు పార్లమెంటు సభ్యులు శివప్రసాద్ కూడా జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధమవుతున్నారట. చంద్రబాబు సొంత జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే మిగతా జిల్లాల పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఏమీ లేనట్లుగా కనిపిస్తోంది.

ముందస్తు ఊహాగానాలతోనే పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికలు వస్తే మాత్రం తప్పకుండా పెద్ద సంఖ్యలో టిడిపి, కాంగ్రెసుల నుండి జంప్ అవుతారంటున్నారు. జగన్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విప్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... టిక్కెట్లు ఇస్తామంటే ఇప్పటికి ఇప్పుడు 70 మంది వరకు ఎమ్మెల్యేలు తమతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆదివారం చెప్పారు.

పార్టీ నేతలు అంబటి రాంబాబు తదితరులు ఎప్పటి నుండో ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నారు. తమ వైపుకు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులా రావడం ఖాయమన్నారు. తాజాగా బాలినేని కూడా 70 మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఎన్నికలు వస్తే ఆ పార్టీ చెప్పినట్లుగా అంతమొత్తం కాకున్నా ఎక్కువ సంఖ్యలోనే టిడిపి, కాంగ్రెసుల నుండి వెళ్లే అవకాశాలు ఉన్నాయని మాత్రం చెబుతున్నారు.

English summary
Former minister Balineni Srinivas Reddy said on Sunday 70 MLAs are ready to join in YSR Congress party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X