కాంగ్రెస్లోకి తెలంగాణ తెలుగుదేశం రెబల్ ఎమ్మెల్యే!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితుడు అయిన శాసనమండలి సభ్యుడు రంగారెడ్డితో వేణుగోపాల చారి సోమవారం భేటీ అయ్యారు. ఈ విషయమై మీడియా ప్రశ్నించగా.. కాంగ్రెసు పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే తాను ఆ పార్టీలో చేరే విషయమై ఆలోచిస్తానని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమై పోయారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి.
వేణుగోపాల చారి 2009 సాధారణ ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. పార్టీ వైఖరితో విభేదించారు. ఆయన నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి గ్రూపులో ఉన్నారు. ఆ గ్రూపులోని జోగు రామన్న, హరీశ్వర్ రెడ్డిలు తెరాసలో చేరారు.
నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. వేణుగోపాల చారి టిడిపి రెబల్గా కొనసాగారు. గత కొంతకాలంగా ఆయన తెరాసలోకి వెళ్తారని, బిజెపిలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆయన కేంద్రం తెలంగాణ ఇస్తే కాంగ్రెసులోకి వెళ్తానని ప్రకటించడం గమనార్హం. అయితే అదిలాబాద్ జిల్లా సీనియర్ నేత ఇంద్రకరణ్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లడంతో వేణుగోపాల చారి కాంగ్రెసులోకి దూకేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది.