పాట్నా ఛాత్ వేడుకల్లో తొక్కిసలాట: 18 మంది మృతి
ప్రార్థనలు చేస్తూ టెర్రాస్లపై, రూఫ్ టాప్లపై నిలుచున్నారు. అదే సమయంలో పెద్ద యెత్తున వేడుకల్లో బాణసంచాలు పేల్చారు. భక్తులు క్రమపద్ధతిలో ఉండడానికి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే సౌకర్యాలు భక్తులకు సరిపోలేదని అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కూలడం వల్ల ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. ఆ వంతెనను వెదురు బొంగులతో ఏర్పాటు చేశారు. బరువుకు తాళలేక అది కూలిపోయి తొక్కిసలాట సంభవించింది. మృతుల్లో 8 మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. చాలా మంది తప్పిపోయినట్లు కూడా తెలుస్తోంది. వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది.
14 మంది మరణించిన విషయాన్ని మాత్రం అధకారులు నిర్ధారిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే. ఈ ఘటనలో 50 మంది దాకా గాయపడినట్లు తెలుస్తోంది. సహాయక చర్యలో పాల్గొంటున్న అధికారులు సంఘటనపై ఏమీ మాట్లాడడం లేదు. ప్రజలు సంఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.