ఆస్తులపై లక్ష్మీపార్వతి పిటిషన్: హైకోర్టుకు చంద్రబాబు
నారా చంద్రబాబు నాయుడు ఆస్తుల పైన ఎసిబితో విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి గతంలో పిటిషన్ దాఖలు చేశారు. కాగా చంద్రబాబు నాయుడు పైన లక్ష్మీ పార్వతి తొలి నుండి పోరు సల్పుతున్న విషయం తెలిసిందే. ఆయన ఆస్తులపై విచారణ జరపాల్సిందిగా ఆమె పిటిషన్ వేశారు. అంతేకాదు నాలుగు నెలల క్రితం చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ గత 15 సంవత్సరాలుగా చేసిన విదేశీ పర్యటనలు, విదేశాలలో వారి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాల్సిందిగా లక్ష్మీపార్వతి ప్రధాని మన్మోహన్ సింగ్ను డిమాండ్ చేశారు.
ఈ మేరకు ఆమె ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్కు లేఖ రాశారు. తన అల్లుడైన చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె ఆ లేఖలో తెలిపారు. చంద్రబాబు విదేశీ పర్యటన వ్యక్తిగతమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ లోగడ తెహల్కా పత్రిక చంద్రబానును దేశంలోని అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకునిగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. బాబుకు సింగపూర్, మలేషియాలలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొందని ఆమె తెలిపారు.
కాబట్టి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు. గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కోర్టుకు నివేదించినా అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైందని ఆమె అన్నారు. చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సిఎం రమేష్, వైవి సుజనాచౌదరి ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారని, ప్రజా జీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లడం ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించిందని ఆమె అన్నారు.
2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్ చేసిందని ఆమె ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు హసనీ అలీ వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చిందని ఆమె గుర్తు చేశారు. అప్పట్లో హసన్ అలీ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజుల్లనే చంద్రబాబు హడావిడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె అన్నారు.