జగన్వైపు వెళ్లట్లేదు: తెరాస ఎమ్మెల్యే, కోమటిరెడ్డిపై ఫైర్
నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి, భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి మేకతోలు కప్పుకున్న పులి అని మండిపడ్డారు. తెలంగాణవాదంతో ఆస్తులు కూడబెట్టుకునేందుకే కోమటిరెడ్డి జగన్ జపం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇలాంటి తెలంగాణ ద్రోహ నేతలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. సమైక్యాంధ్ర పార్టీలకు తెలంగాణలో చోటు లేదన్నారు. ఆ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవన్నారు. తాను ఎట్టి పరిస్థితుల్లో తెరాసను వీడేది లేదన్నారు. తెలంగాణ ద్రోహులే జగన్ పార్టీలోకి వెళ్తారన్నారు.
అమరవీరుడు శ్రీకాంత చారి ఫోటో పెట్టుకొని దీక్ష చేసిన కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఉద్యమాన్ని కించపర్చేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు తన వైఖరి ఇప్పటికీ తెలియజేయలేదన్నారు. తెలంగాణ సాధించే వరకు తమ పోరాటం ఆపేది లేదన్నారు.
తాను జగన్ పార్టీలోకి వెళ్తున్నాననే వార్తలు అంతా వట్టి ప్రచారమేనని మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ వేరుగా అన్నారు. తాను ఓడిపోయినా గెలిచినా కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని చెప్పారు. కావాలనే తాను ఆ పార్టీలోకి వెళ్తారనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు.