నాగార్జున, మోహన్‌బాబు జగన్‌నే కలిశారు: టిడిపి

Telugudesam
హైదరాబాద్: చంచల్‌గుడా జైలులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ అలియాస్ మ్యాట్రిక్స్ ప్రసాద్‌ను కలిశామని చెబుతున్నవారంతా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డినే కలుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిశామని చెప్పిన సినీ నటులు మోహన్ బాబు, నాగార్జున చంచల్‌గుడా జైలులో జగన్‌ను కలిశారని ఆయన అన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద పక్కా సమాచారం ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

వైయస్ జగన్‌ను మే 29వ తేదీ నుంచి ఇప్పటి వరకు 134 మంది కలిశారని ఆయన చెప్పారు. జగన్‌కు కల్పిస్తున్న అదనపు సౌకర్యాలపై జైలు సిబ్బంది తమకు ఓ లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. చంచల్‌గుడా జైలు వైయస్ జగన్ క్యాంపు కార్యాలయంగా మారిందని వ్యాఖ్యానించారు. జైలు అధికారులు జగన్‌కు ఎలా సహకరిస్తున్నారనే విషయంపై, అక్కడ జరుగుతున్న అవకతవకలపై ది గార్డెనింగ్ వార్డర్ స్టాఫ్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, గవర్నర్ నరసింహన్‌కు రాసిన లేఖను ఆయన మీడియా ముందు పెట్టారు.

నాలుగు నెలల కాలంలో అంత మంది జగన్‌ను కలుసుకునే అవకాశాన్ని ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మాజీ డిజిపి అరవింద రావు జైలు నుంచి బయటకు వస్తూ తాను తన పాత మిత్రుడు బిపి ఆచార్యను కలిశానని చెప్పారని, అయితే బిపి ఆచార్య ములాఖత్ లిస్టులో అరవింద రావు పేరు లేదని ఆయన చెప్పారు.

అలాగే, తాను నిమ్మగడ్డ ప్రసాద్‌ను కలిసినట్లు మోహన్ బాబు చెప్పారని, నిమ్మగడ్డ ములాఖత్ జాబితాలో మోహన్ బాబు పేరు లేదని ఆయన చెప్పారు. వీరిలో ఎవరు ఎవరిని కలుస్తున్నారో తెలియజేయాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్‌కు జైలు వేసవి విడిదిలా ఉంటే, జగన్ కుటుంబ సభ్యులకు పిక్నిక్ స్పాట్‌లా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిజిపిల సహాయ సహకారాలతోనే జగన్‌కు జైలులో సకల సౌకర్యాలు అందుతున్నాయని ఆయన విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+