పార్లమెంటు అదే తీరు: మన ఎంపీల వేర్వేరు ధర్నాలు
నీలం తుఫాను బాధితులకు సాయం అందించాలని కూడా తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు డిమాండ్ చేశారు. నీలం తుఫాను బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు విమర్శించారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్ర మంత్రులున్నా రైతులకు ప్రయోజనం శూన్యమని ఆయన అన్నారు. ఎఫ్డిఐలతో రైతులకు జరిగే మేలు ఏమిటో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరు వ్యాపారుల పొట్ట కొట్టేందుకే ప్రభుత్వం ఎఫ్డిఐలకు అనుమతి ఇచ్చిందని విమర్శించారు.
ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై తెలంగాణ నినాదాలు చేస్తూ కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు ధర్నా చేశారు. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. తమ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని వారు చెప్పారు. తెలంగాణ ఫ్రంట్ పెట్టడానికి కూడా వెనకాడబోమని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రాంతంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వివక్ష చూపుతున్నారని తెలంగాణ ఎంపీలు విమర్శించారు. నాగార్జున సాగర్కు కాకుండా ఇతర ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారని, ఇది స్పష్టంగా జలదోపిడయేనని వారన్నారు. నీటి విడుదలలో వివక్షపై ప్రధానికి, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి వారు లేఖ రాశారు. నాలుగు సార్లు లేఖలు రాసినా ముఖ్యమంత్రి పట్టింటుకోలేదని, దాంతో సోనియాకు లేఖ రాశామని వారు చెప్పారు. నీటి పంపిణీకి ప్రత్యేక రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదిలా వుంటే, ఎఫ్డిఐలపై పార్లమెంటు ఉభయ సభలూ రెండో రోజు శుక్రవారం కూడా దద్ధరిల్లాయి. లోకసభ, రాజ్యసభల్లో ఎఫ్డిఐలపై తక్షణ చర్చకు ప్రతిపక్షాలు పట్టు పట్టాయి. దీంతో ఉభయ సభల్లోనూ కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో ఉభయ సభలు పలుసార్లు వాయిదా పడి చివరకు సోమవారానికి వాయిదా పడ్డాయి.