హైదరాబాదీని అందుకే స్వార్థం, మీ సహకారంతో: కిరణ్
ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, మంత్రులు, పార్టీ నేతలు, ప్రజల సహకారంతో తాను రెండేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగానని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి వెనుక తన స్వార్థం కూడా కాస్త ఉందన్నారు. తాను ఇక్కడే పుట్టి, పెరిగి, చదువుకున్నానని చెప్పారు. అలాంటి నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. రాష్ట్రాన్ని పాలించే అవకాశం తనకు కాంగ్రెసు కల్పించిందని, ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేయాల్సిందే అన్నారు.
హైదరాబాదును ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. 2014 జూన్ కల్లా మెట్రో ట్రయల్ రన్ ఉంటుందని, 2014 డిసెంబర్ కల్లా మెట్రో రైలును జాతికి అంకితం చేస్తామన్నారు. ఒక్కరోజు ఆలస్యమైనా ఎల్ అండ్ టి సంస్థ రూ.32 లక్షల ఫైన్ కట్టాల్సి వస్తుందన్నారు. రూ.14వేల 132 కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టామన్నారు. 2013 డిసెంబర్ నాటికి హైదరాబాదుకు కృష్ణా తాగునీటిని తీసుకు వస్తామన్నారు.
ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, పలువురు కేంద్రమంత్రులు, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు హాజరయ్యారు.