కసబ్లా ఉరేయాలి: కెసిఆర్పై మోత్కుపల్లి, అరెస్ట్
అంతకుముందు మోత్కుపల్లి నర్సింహులు గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కెసిఆర్ తెలంగాణ పేరుతో ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటులో మాట్లాడితే తెలంగాణ వస్తుందా లేక సూర్యాపేటలో మాట్లాడితే వస్తుందా అని ప్రశ్నించారు. ఓట్లు సీట్ల కోసమే ఆయన పార్లమెంటుకు వెళ్లకుండా ఇక్కడ సభలు, సమావేశాలు అంటున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణపై కెసిఆర్కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షానికి ఎందుకు డిమాండ్ చేయడం లేదన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అఖిలపక్షానికి డిమాండ్ చేస్తున్నారన్నారని గుర్తు చేశారు. తెలంగాణ కావాలంటే కెసిఆర్ కూడా కేంద్రంపై అఖిలపక్షానికి ఒత్తిడి తీసుకు రావాలన్నారు. తెలంగాణ పట్ల కెసిఆర్ తీరుకు నిరసనగా తాను దీక్ష చేపడుతున్నట్లు మోత్కుపల్లి చెప్పారు. కసబ్ లాగే కెసిఆర్ను ఉరేయాలన్నారు.
తెరాస తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడింది కాదన్నారు. రాజకీయ పబ్బం కోసమే సూర్యాపేట సమరభేరీ అన్నారు. కాగా సూర్యాపేటలో తెలంగాణ రాష్ట్ర సమితి బహిరంగ సభకు మోత్కుపల్లి కౌంటర్గా దీక్ష ప్రారంభించారు. పోలీసులు దీక్ష భగ్నం చేసి అతనిని అరెస్టు చేశారు.