వైఎస్ తప్పుతో జైల్లో జగన్: కోట్ల, ఎన్టీఆర్పై పురంధేశ్వరి
సొంత ప్రయోజనాల కోసమే జలయజ్ఞంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విమర్శలు చేస్తోందన్నారు. షర్మిల చేపడుతున్న పాదయాత్రలో స్థానిక జనం ఎవరూ ఉండటం లేదన్నారు. అనంత వెంకట రెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఓ గొప్ప సాంకేతికావిష్కరణ అని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ సహాయ మంత్రి పురందేశ్వరి అన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టులో ఎనిమిది లిఫ్ట్లను ఉపయోగించి, వెయ్యి అడుగులపైకి నీటిని తోడటడానికి పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారని ప్రశంసించారు.
అత్యంత నైపుణ్యంతో పూర్తి చేసిన ఈ బృహత్తర పథకం విమర్శకుల నోళ్లు మూయిస్తుందన్నారు. సొంత ప్రయోజనాల కోసమే జలయజ్ఞంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న రైతులకు సాగునీరు అందించడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నేరమా అని ప్రశ్నించారు. హంద్రీనీవా పథకానికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ప్రాణం పోశారన్నారు. హంద్రీనీవాకు రూపకల్పన చేసిన తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును, శివరామక్రిష్ణయ్యను స్మరించుకోవాలన్నారు.
ఎన్టీఆర్ తర్వాత అధికారంలోకి వచ్చిన టిడిపి హంద్రీనీవాకు పిడికెడు మట్టికూడా వేసిన పాపాన పోలేదని విమర్శించారు. దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవారు విమర్శిండంపై పురందేశ్వరి మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు.. వ్యక్తిగత పథకాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు.