తరగతి గోడల మీద అశ్లీల రాతలు: బాలిక ఆత్మహత్య
వివరాలు ఇలా ఉన్నాయి - శివానీ రజావత్ అనే 15 ఏళ్ల బాలిక గోపాల్ ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతోంది. తనపై తరగతి గది గోడల మీద అశ్లీల రాతలు ఉండడాన్ని మంగళవారం ఉదయం శివానీ చూసింది. దాంతో కలత చెందింది. రెండో పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లడానికి ప్రిన్సిపాల్ను అనుమతి కోరింది. అందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు.
మూడో పీరియడ్ అయిపోయిన తర్వాత రాతపూర్వకంగా మరోసారి అనుమతి కోరింది. తనకు బాగా లేదని, ఇంటికి వెళ్లడానికి అనుమతించాలని కోరింది. దాంతో ప్రిన్సిపాల్ తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు అడిగారు. తండ్రి వీరూ రజత్ చనిపోయాడని, తల్లి మమతా దేవి అంగన్వాడీ వర్కర్ కావడంతో పనికి వెళ్లిందని, సోదరుడు అభయ్ రజావత్ మథురలో చదువుతున్నాడని చెప్పింది.
తెలివైన విద్యార్థి కావడంతో, ఎప్పుడు కూడా ముందుగానే వెళ్లిపోవడానికి అనుమతి కోరకపోవడంతో ప్రిన్సిపాల్ ఇంటికి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. కోట్వాల్ పోలీసు పిరిధిలోని తిలక్ నగర్లో గల తన ఇంటికి శివానీ చేరుకుంది. ఇంట్లో తాత ఉన్నాడు. తనకు బాగా లేదంటూ గదిలోకి వెళ్లింది. సాయంత్రం తల్లి వచ్చి చూసే సరికి ఆమె ఉరేసుకుని కనిపించింది.
తరగతి గదిపై అశ్లీల వ్యాఖ్యలు రాసిన వ్యక్తిని కనిపెట్టడానికి ఓ కమిటీ వేసినట్లు కాలేజీ ప్రిన్సిపాల్ కుసుమ్ బిష్ణోయ్ చెప్పారు. ఏ విధమైన సూసైడ్ నోట్ కనిపించలేదని పోలీసులు చెప్పారు.