తొందరతో పార్టీని వీడొద్దు: కెసిఆర్, జగన్ భయమా?
తెలంగాణ జెఎసి తమతోనే ఉందని ఆయన చెప్పుకున్నారు. నెల రోజుల్లో ఊహించని మార్పులు వస్తాయని అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల నుంచి 15 మంది శాసనసభ్యులు పార్టీలోకి వస్తామంటున్నారని, అందరినీ తీసుకుని ఇబ్బంది పడదలుచుకోలేదని ఆయన అన్నారు. కొత్తవారు వచ్చినా పాతవారిని విస్మరించబోనని హామీ ఇచ్చారు. కార్యవర్గంలో ఉన్నవారందరికీ పదవులు వస్తాయని చెప్పారు.
అదే సమయంలో పార్టీ నాయకులకు హెచ్చరిక లాంటిది కూడా చేశారు. పనిచేయని నియోజకవర్గం ఇంచార్జీలను మార్చేస్తానని అన్నారు. డిసెంబర్ 5వ తేదీనుంచి తలపెట్టిన పల్లెబాటను సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని, ఒక్కో నియోజకవర్గంలో పరిస్థితిని, నియోజకవర్గం పరిధిని బట్టి 30 రోజుల నుంచి 40 రోజుల వరకు పల్లెబాట నిర్వహించాలని ఆయన సూచించారు. పల్లెబాటలో పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ ప్రజలంతా తెరాసతోనే ఉన్నారని, వారిని తమ మలుచుకోవడంలో పార్టీ నాయకులే విఫలమవుతున్నారని ఆయన అన్నారు. ఓట్ల వరదను అందుకున్నవాడే విజేత అని చెప్పారు. అందరినీ రాజకీయంగా ఓ స్థాయికి తెచ్చే బాధ్యత తనదేనని కెసిఆర్ అన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమకు 73 అసెంబ్లీ స్థానాలు, 14 లోకసభ స్థానాలు వస్తాయని ఆయన చెప్పారు. అందుకు ఓ సంస్థ నిర్వహించిన సర్వేను ఉటంకించారు. పల్లెబాటలో తాను పాల్గొనే విషయంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. తెరాస సూర్యాపేటలో మాదిరిగా నిజామాబాద్లో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది.
తమ పార్టీ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పార్టీ మారుతారనే వార్తల్లో నిజం లేదని తెరాస శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందరు చెప్పారు. సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రొత్ని జిల్లాల పార్టీ అధ్యక్షులను మార్చే అవకాశం ఉందని చెప్పారు. పనిచేయని నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు ఉంటుందని అన్నారు.