నరకం చూపించారు: కంటతడి పెట్టిన యడ్యూరప్ప

పార్టీ కోసం తాను ఎంతో శ్రమించానని చెప్పారు. తనను పార్టీలో సరిగా చూడలేని ఆయన బిజెపిని నిందించారు. పార్టీ కోసం తాను ఎంతో శ్రమించినప్పటికీ, లోకసభ సీట్లు ఎక్కువగా సంపాదించి పెట్టినప్పటికీ తనకు పార్టీలో తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తే తాము అధిష్టించవచ్చునని కొంత మంది తనకు వ్యతిరేకంగా పనిచేశారని ఆయన అన్నారు. పార్టీని వీడవద్దని వచ్చిన విజ్ఞప్తులను ఆయన తిరస్కరించారు. బిజెపికి, శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు.
బిజెపిలో ఆయన నలబై ఏళ్ల పాటు పనిచేశారు. "నేను పార్టీ నుంచి తప్పుకుంటున్నా. పార్టీ నాకు ప్రతిదీ ఇచ్చింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా" అని ఆయన అన్నారు. యడ్యూరప్ప రాజీనామాకు ముందే ఆయన నియోజకవర్గంలోని బిజెపి శాఖ మొత్తం రాజీనామా చేసింది. తాను వారిని రాజీనామా చేయాలని అడగలేదని యడ్యూరప్ప చెప్పారు.
ప్రస్తుతానికి రాజీనామా చేయవద్దని తన వర్గానికి చెందిన శాసనసభ్యులకు తాను సూచించినట్లు ఆయన తెలిపారు. మధ్యాహ్నం 12 గంటలకు యడ్యూరప్ప విధాన సభకు వెళ్లి రాజీనామా లేఖను సమర్పిస్తారు. పార్టీ తనను వద్దని అనుకుంటోందని, అందుకే రాజీనామా చేస్తున్నానని యడ్యూరప్ప అన్నారు.
ఇదిలా వుంటే, యడ్యూరప్ప డిసెంబర్ 9వ తేదీన కర్ణాటక జనతా పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. అది కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం కావడం విశేషం. దాదాపు 50 మంది శానససభ్యులు తమ పార్టీలో చేరుతారని యడ్యూరప్ప పెట్టబోయే కెజెపి నాయకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications