తెలుగు దంపతులపై తీర్పు రేపటికి వాయిదా
కుమారుడిని కొట్టాడనే ఆరోపణపై నార్వేలో అరెస్టయిన తెలుగు దంపతుల విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. నార్వే చట్టాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది. రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలుగు దంపతులను ఆదుకోవాలని కేంద్ర మంత్రి వాయలార్ రవిని కోరారు. అరెస్టయిన తెలుగు దంపతులు పిల్లల పట్ల దురుసుగా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదని నార్వే అధికారులు అంటున్నారు.
కుమారుడి పట్ల దురుసుగా ఆరోపణలతో నార్వేలో అరెస్టయిన తెలుగు దంపతులపై నార్వే అధికారులు అభియోగాలు మోపారు. వారిలో ఏడాది మూడు నెలలు తల్లికి, ఏడాదిన్నర తండ్రికి జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. దంపతులను కస్టడీకి రిమాండ్ చేసినట్లు ఓస్లో పోలీసులు చెప్పారు. హైదరాబాద్ నగరానికి చెందిన చంద్రశేఖర్, అనుపమ దంపతులను నార్వే పోలీసులు అరెస్టు చేశారు వి.చంద్రశేఖర్ టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)కు చెందిన కంపెనీలో ఉద్యోగి. అతని భార్య అనుపమ. చంద్రశేఖర్ ఓస్లోలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమ అబ్బాయి పదే పదే స్కూలు నుంచి ఇతరుల బొమ్మలు తెస్తుండటంతో చంద్రశేఖర్ అతడిని మందలించారు. దానిపై ఆ అబ్బాయి తన పాఠశాలలోని ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయడమే కాక.. తిరిగి భారత్కు పంపేస్తామని బెదిరిస్తున్నట్లు కూడా వారికి చెప్పాడని చంద్రశేఖర్ తమ్ముడి కొడుకు శైలేందర్ తెలిపారు. దీనిపై విచారించిన అక్కడి అధికార వర్గాలు చంద్రశేఖర్, అనుపమలు తమ పిల్లవాడికి చెమ్చాకు బదులు చేత్తో అన్నం పెడుతున్నారని, ఇలా అనేక రకాల తప్పులను ఎత్తి చూపారు. అయితే తాము అన్ని తప్పులు చేసినట్లు ఆ దంపతులకు తెలీదు. కానీ తొమ్మిది నెలల తర్వాత దంపతులిద్దరూ అరెస్టయ్యారు.