గిల్ సేన సరికొత్త రికార్డు: మూడు రోజుల్లోనే ముగించిన భారత్!
ముల్లాన్పూర్లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఆఫ్ఘనిస్థాన్ జట్టుపై టీమిండియా 300 పరుగుల భారీ తేడాతో తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోవడం విశేషం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు ఇదే అతిపెద్ద ఇన్నింగ్స్ విజయం. గతంలో 2018 అక్టోబర్లో రాజ్కోట్ వేదికగా వెస్టిండీస్పై ఇన్నింగ్స్, 272 పరుగుల తేడాతో సాధించిన విజయమే ఇప్పటివరకు రికార్డుగా ఉండేది.
భారీ స్కోరు చేసిన భారత్.. ఫాలోఆన్లో కుప్పకూలిన ఆఫ్ఘనిస్తాన్
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శుభ్మన్ గిల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తన మొదటి ఇన్నింగ్స్ను 8 వికెట్ల నష్టానికి 564 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు కేవలం 152 పరుగులకే ఆలౌట్ అయింది. దీనితో భారత్కు 412 పరుగుల భారీ ఆధిక్యం లభించడంతో ఆఫ్ఘనిస్తాన్కు ఫాలోఆన్ లభించింది. అయితే రెండో ఇన్నింగ్స్లోనూ ఆఫ్ఘన్ బ్యాటర్లు భారత బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. కేవలం 112 పరుగులకే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ కూడా ముగిసింది.

రెండో ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ హవా
ఫాలోఆన్ ఆడుతూ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆఫ్ఘనిస్తాన్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ అబ్దుల్ మాలిక్ (8)ను మహ్మద్ సిరాజ్ త్వరగానే పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత ఆఫ్ఘన్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఓపెనర్ సెదికుల్లా అటల్ గరిష్టంగా 42 పరుగులు చేయగా.. రహ్మానుల్లా గుర్బాజ్ (24), రహ్మత్ షా (13) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో చెలరేగగా.. కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు, అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ ఒక వికెట్ పడగొట్టారు. శరాఫుద్దీన్ అష్రఫ్ గాయం కారణంగా బ్యాటింగ్కు రాలేకపోయాడు.
అరంగేట్రంలోనే అదరగొట్టిన మానవ్ సుతార్
ఈ మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసిన యువ స్పిన్నర్ మానవ్ సుతార్ సరికొత్త స్టార్గా అవతరించాడు. ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ను కుప్పకూల్చడంలో మానవ్ సుతార్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మానవ్ సుతార్ 6 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ బ్యాటింగ్ లైనప్ను దెబ్బతీశాడు. ఆఫ్ఘనిస్తాన్ తరఫున రహ్మత్ షా ఒంటరి పోరాటం చేసి, భారత్పై టెస్టుల్లో హాఫ్ సెంచరీ (60 పరుగులు, 135 బంతుల్లో) చేసిన మొదటి ఆఫ్ఘన్ బ్యాటర్గా రికార్డు సృష్టించినప్పటికీ.. అతడిని కూడా మానవ్ సుతార్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లతో రాణించాడు.
భారత్ బ్యాటింగ్లో గిల్, కేఎల్ రాహుల్ శతకాల మోత
అంతకుముందు భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్తో విరుచుకుపడింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 177 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్తో 126 పరుగులు చేశాడు. ఇది గిల్ టెస్ట్ కెరీర్లో 11వ శతకం. మరోవైపు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 165 బంతుల్లో 11 ఫోర్లతో 100 పరుగులు చేసి తన 12వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వీరితో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ (81), వికెట్ కీపర్ రిషభ్ పంత్ (81), వాషింగ్టన్ సుందర్ (52*) అర్ధ సెంచరీలతో రాణించారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మహ్మద్ సలీమ్ సఫీ ఒక్కడే 6 వికెట్లు పడగొట్టడం గమనార్హం.












Click it and Unblock the Notifications