మమతకు భారీ షాక్..! ఎన్డీయేలోకి 20 ఎంపీలు? లోక్ సభ స్పీకర్ కు లేఖ..!
పశ్చిమబెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి ఇవాళ తన రాజకీయ జీవితంలోనే అతిపెద్ద షాక్ తగిలింది. తాను స్వయంగా లోక్ సభకు ఎంపిక చేసిన పంపిన ఎంపీల్లో 20 మంది ఇప్పుడు తన పార్టీని వీడి ఎన్డీయేలో చేరిపోయేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు 20 మందీ టీఎంసీ ఎంపీలు (TMC Mps) లేఖ రాశారు. దీంతో లోక్ సభలో టీఎంసీ నిట్టనిలువుగా చీలిపోతోంది.
సీనియర్ ఎంపీ కకోలీ ఘోష్ దస్తీదార్ నేతృత్వంలోని 20 మంది రెబెల్ ఎంపీలు తమను అధికార ఎన్డీయేలో భాగంగా గుర్తించాలనని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాసారు. ఇవాళ ఉదయం తృణమూల్ రాజ్యసభ ఎంపీ సుఖేందు శేఖర్ రే .. పార్టీకి, అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మమతా బెనర్జీ ఢిల్లీ వెళ్లి ఇండియా కూటమి సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే ఈ పరిణామం చోటు చేసుకుంది. దీనికి కొనసాగింపుగా లోక్ సభ స్పీకర్ కు రెబెల్ ఎంపీలు లేఖ రాశారు.

ఉదయం రెబెల్ ఎంపీలు ఢిల్లీలోనే కేంద్రమంత్రి, బీజేపీ బెంగాల్ ఎన్నికల ఇన్చార్జి భూపేందర్ యాదవ్కు చెందిన మోతీలాల్ నెహ్రూ మార్గ్లోని నివాసంలో సమావేశమయ్యారు. ఇందులో రేతో పాటు సుమారు 20 మంది ఎంపీలు ఉన్నారు. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కూడా పాల్గొన్నారు. ఈ మీటింగ్ కు రెబెల్ ఎంపీలు ప్రసూన్ బెనర్జీ (హౌరా), షర్మిలా సర్కార్ (బర్ధమాన్ పుర్బా), జగదీష్ చంద్ర బసునియా (కూచ్ బెహార్), అరూప్ చక్రవర్తి (బంకురా), కాలిపడా సోరెన్ (జార్గ్రామ్), అసిత్ మల్ (బోల్పూర్) బాపి హల్దార్ (మథురాపూర్) హాజరయ్యారు. ఈ భేటీకి వెళ్లొద్దని వీరిని తోటి ఎంపీ అభిషేక్ బెనర్జీ అభ్యర్ధించినా వారు పట్టించుకోలేదు.
తాజా పరిణామాలను బట్టి చూస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో టీఎంసీ ప్రజాప్రతినిధులు రెబెల్స్ గా మారిపోతున్నట్లు తెలుస్తోంది. వీరి ఫిరాయింపు చూస్తుంటే రాజకీయంగా తృణమూల్ కాంగ్రెస్ భారీగా నష్టపోతున్నట్లు అర్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ తరపున గెలిచిన 80 ఎమ్మెల్యేల్లో 58 మంది రితబ్రత బెనర్జీ నేతృత్వంలో చీలిపోయారు. అనంతరం ఇప్పుడు ఎంపీలు కూడా పార్టీని వీడి బీజేపీ గూటిలో చేరిపోతున్నారు.














Click it and Unblock the Notifications