వాస్తు ప్రకారం వంటింట్లో గిన్నెలు మాడొచ్చా?
వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగది కేవలం ఆకలి తీర్చే స్థలం మాత్రమే కాదు.. అది ఇల్లంతటికీ అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని, సానుకూల శక్తిని పంచే ఒక పవిత్రమైన దేవాలయం. అందుకే వంటగదిలో మనం చేసే చిన్న చిన్న పనులు కూడా మన ఆర్థిక, మానసిక జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. చాలా ఇళ్లలో వంట చేసేటప్పుడు మనకు తెలియకుండానే చపాతీలు లేదా రొట్టెలు పదేపదే మాడిపోతుంటాయి. కేవలం మంట ఎక్కువవడం వల్లే ఇలా జరుగుతుందని మనం అనుకుంటాం, కానీ వాస్తు నమ్మకాల ప్రకారం పెనంపై చపాతీలు తరచూ మాడిపోవడం వెనుక కొన్ని ఆందోళనకరమైన వాస్తు దోషాలు దాగున్నాయి.అసలు చపాతీలు మాడిపోవడానికి, ఇంటి ఆర్థిక ఇబ్బందులకు ఉన్న లింక్ ఏంటి? దీనివల్ల వచ్చే నష్టాలు, పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం.
ఆగ్నేయ మూల అత్యంత అనుకూలం
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంటికి ఆగ్నేయ మూల వంటగది నిర్మించడానికి అత్యంత అనుకూలమైన స్థానం, ఎందుకంటే ఈ దిశ అగ్ని దేవునికి చెందుతుంది. వంటగదిలో రొట్టెలు లేదా చపాతీలు తరచుగా మాడిపోవడం అనేది ఆ ఇంట్లోని 'అగ్ని తత్వం' సమతుల్యంగా లేదని సూచిస్తుంది. ఈ అసమతుల్యత కారణంగానే ఇంట్లో అనవసరమైన ధన నష్టం జరగడం, చేతికి వచ్చిన డబ్బు నిలవకపోవడం, కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే కోపతాపాలు, గొడవలు రావడం జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

చపాతీ కాలిపతే పెనం శుభ్రం చేయండి
వంటగదిలో ఒక చపాతీ మాడిపోయినప్పటికీ, ఆ పెనాన్ని శుభ్రం చేయకుండా నిర్లక్ష్యంతో తర్వాతి చపాతీలను అలాగే కాల్చడం అస్సలు మంచిది కాదు. మాడిపోయిన చపాతీ ముక్కలను లేదా నల్లటి పొరలను పెనం మీదే వదిలివేయడం ధాన్య లక్ష్మిని, అన్నపూర్ణా దేవిని అవమానించడంతో సమానం. దీనివల్ల ఇంట్లో ఉండాల్సిన సంతోషం, ప్రశాంతత క్రమంగా తగ్గిపోయి నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అలాగే వంటగదిలో వస్తువులు చిందరవందరగా ఉన్నప్పుడు లేదా వాడిన ఎంగిలి పాత్రలు సింక్లో రోజులు తరబడి పడి ఉన్నప్పుడు వంట చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
నల్లటి అవశేషాలు తొలగించండి
వంట చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా చపాతీ మాడిపోతే, వెంటనే ఆ పెనాన్ని పక్కకు దించి, పూర్తిగా శుభ్రం చేయాలి. మాడిన నల్లటి అవశేషాలను పూర్తిగా తొలగించిన తర్వాతే తదుపరి చపాతీని కాల్చాలి. ప్రతిరోజూ వంట పూర్తయిన వెంటనే వంటగది ప్లాట్ఫారమ్ను లేదా కౌంటర్ టాప్ను శుభ్రమైన బట్టతో తుడవాలి. రాత్రి పూట ఎంగిలి పాత్రలను సింక్లో వదిలేయకుండా ఎప్పటికప్పుడు కడిగేసుకోవడం వల్ల ఇంట్లో సంపద పెరుగుతుంది. ఆహారాన్ని కేవలం ఒక బాధ్యతగా కాకుండా, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడే అమృతంగా భావించాలి. వంట చేసేటప్పుడు మనస్సులో కోపం, ఆందోళన లేకుండా ఎంతో ప్రశాంతంగా, దైవచింతనతో వంట చేయడం వల్ల ఆ ఆహారంలో సానుకూల శక్తులు చేరి కుటుంబానికి మనశ్శాంతిని చేకూరుస్తాయి. వంటగది ఎంత శుభ్రంగా, క్రమబద్ధంగా ఉంటే ఆ ఇల్లు అంతగా సానుకూల శక్తితో నిండి ఉంటుంది. కాబట్టి వంటగదిలో ఈ చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, ఇల్లంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుంది.












Click it and Unblock the Notifications