ఒకప్పుడు మీసొత్తు, ఓడితే..: బాలకృష్ణకు నాని కౌంటర్
నందమూరి బాలకృష్ణతో ఉన్న వారు అందరూ మేక వన్నె పులులే అన్నారు. అసలైన నాయకుడు ఎవరూ ఆయన వెంట లేరని విమర్శించారు. తాను వచ్చే ఎన్నికల్లో గుడివాడ నుండే పోటీ చేస్తానని చెప్పారు. బాలకృష్ణ పోటీ చేసినా నేనే బరిలోకి దిగుతానని, ఒకవేళ బాలయ్య చేతిలో తాను ఓడిపోతే పక్క రాష్ట్రానికి వెళ్లిపోతానని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైనా ఆయన నిప్పులు చెరిగారు.
తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం చంద్రబాబును విమర్శిస్తానని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, గుడివాడలో ఎవరు పోటీ చేసినా తాను వెనక్కి వెళ్లే సమస్య లేదన్నారు. వచ్చే ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు సంస్కారం లేదని అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైల్లో లేరని ప్రజల గుండెల్లో ఉన్నారన్నారు.
కాగా ఆదివారం బాలకృష్ణ గుడివాడలో పర్యటించి పరోక్షంగా కొడాలి నాని పైన నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. గుడివాడ ఎవడబ్బ సొత్తు కాదని, తమ సొత్తు అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కొందరు పార్టీ టిక్కెట్ పైన గెలిచి, పార్టీ అధిష్టానం పైన ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వాళ్లకు ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దీనికి కొడాలి నాని ఈ రోజు పెదవి విప్పారు. బాలయ్య సవాల్కు ధీటుగా స్పందించారు. బాలయ్య పోటీ చేసినా తాను రంగంలోకి దిగుతానని స్పష్టం చేశారు.