ఎమ్మెల్యే పదవికి ధర్మాన రాజీనామా: జగన్ లక్ష్యంగా..?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరుగురు మంత్రులకు సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాన్పిక్ కేసులో మాజీ మంత్రి మోపిదేవి ఇప్పటికే చంచల్గూడ జైలులో ఉన్నారు. వాన్పిక్ అంశంలోనే ధర్మాన కొద్ది నెలల క్రితం రాజీనామా చేశారు. రాష్ట్ర మంత్రివర్గం ధర్మానను సిబిఐ విచారణకు తిరస్కరిస్తూ నిర్ణయించింది.
దీనిని ముఖ్యమంత్రి కిరణ్ గవర్నర్ నరసింహన్కు పంపించారు. ధర్మాన ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వవద్దన్న కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆమోదిస్తారా లేక తిరస్కరిస్తారా అనే అంశం కాంగ్రెసు వర్గాల్లో ముఖ్యంగా ధర్మానను ఆందోళనకు గురి చేస్తోంది. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వంటి పలువురు మాత్రం విచారణకు అనుమతిస్తేనే మంచిదనే భావనతో ఉన్నారు.
ధర్మానను విచారణకు అనుమతించడం ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఒక్కడినే ఈ కేసులో నిందితుడుగా చేయవచ్చనే భావన పలువురు కాంగ్రెసు నాయకులలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాకాకుండా ప్రాసిక్యూషన్కు అనుమతించకుంటే మంత్రులను కాపాడిన అపప్రద ప్రభుత్వంపై పడుతుందని అంటున్నారు. మంత్రులను విచారణకు అనుమతించి తమ తప్పులేదని నిరూపించుకునేలా చేసి జగన్ను నిందితుడిగా చూపించాలని భావిస్తున్నారట.