జగన్ను జైల్లో పెడితే తప్పా, లక్షల కోట్లు..: బొత్స
రాష్ట్రంలో రెండే సమస్యలున్నాయని, అవి వ్యవసాయం, విద్యుత్తు అని, ఈ రెండు సమస్యలను సమర్థంగా ఎదుర్కోగలిగితే కాంగ్రెసుకు ఢోకా లేదని ఆయన అన్నారు. అయినా ఐదేళ్లు అధికారం లేకపోతే చచ్చిపోతామా అని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వల్ల కాంగ్రెసుకు నష్టమేమీ లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్లేవారిని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీ, తదితర సంక్షేమ పథకాలన్నీ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కన్నా మెరుగ్గా అమలవుతున్నాయని ఆయన చెప్పుకున్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని నిరూపిస్తే తల దించుకుంటానని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణను శనివారం మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు కలిశారు.
బొత్స సత్యనారాయణను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడడానికి ధర్మాన ప్రసాద రావు నిరాకరించారు. రాజ్యసభకు తెలుగుదేశం పార్టీ సభ్యులు హాజరు కాకపోవడంతో కాంగ్రెసు పార్టీకి సంబంధం లేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. గతంలో తెలుగదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమకు వ్యతిరేకంగా కుట్ర చేశాయని ఆయన ఆరోపించారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలే కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు. వ్యక్తిగత కారణాలతోనే వారు సభకు హాజరు కాలేదని ఆయన అన్నారు.
పార్టీని బలోపేతం చేయడానికే 16వ తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. సబ్ ప్లాన్ను అడ్డుకునేందుకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆయన అన్నారు.