రెండురెండు కూడితే ఆరు: జగన్వైపు ఎమ్మెల్యేలపై కిరణ్
నలభై ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి నూటా యాభై మంది ఎమ్మెల్యేలు రెడ్డి కాంగ్రెస్లోకి వెళ్లి పోయారని, అయినా తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని గుర్తు చేశారు. రాజకీయాలంటే గణాంకాలు కాదన్నారు. రెండు రెండు కూడితే లెక్కల్లో నాలుగు వస్తుందని కానీ, రాజకీయాల్లో ఆరు కూడా రావొచ్చునని చెప్పారు.
1999లో కార్గిల్ యుద్ధం కారణంగా బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, ఆ తర్వాత ధరల పెరుగుదలతో ఓడిపోయిందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల వలసల కంటే క్షేత్రస్థాయిలో నాయకుల వలసలకే తాను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అన్నీ సర్దుకుంటాయన్నారు. కాంగ్రెస్లో ఎవ్వరూ పార్టీ కంటే పెద్దవారు కాదన్నారు.
పార్టీ ద్వారానే ఈ పదవులు, హోదాలు వచ్చాయన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. సంక్రాంతిలోపు నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని చెప్పారు. ఎన్నాళ్లు పార్టీలో ఉన్నా గుర్తింపు రాలేదంటూ రాజీనామా చేసిన కావూరి సాంబశివ రావు అంశాన్ని ప్రస్తావించగా.. ఆయన చాలా సీనియర్ అని, ఆ విషయం పార్టీ అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.