జగన్ పార్టీ పేరు కాంగ్రెస్(వై), బెదిరేది లేదు: చంద్రబాబు
జగన్ దోచిన లక్ష కోట్ల డబ్బులో పది శాతం ఖర్చు చేసినా చాలా గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. జగన్ వంటి అక్రమార్కులను వచ్చే ఎన్నికల్లో చిత్తు చేయాలని పిలుపునిచ్చారు. జగన్ వద్ద ఉన్న సొమ్మంతా రాష్ట్రాన్ని దోచి కూడబెట్టిందే అన్నారు. పార్టీని వదిలేసిన వాళ్ల హెచ్చరికలకు బెదిరే సమస్య లేదన్నారు. నేతలు వెళ్లినా కార్యకర్తలు ఎప్పుడూ పార్టీతోనే నడిచారన్నారు.
వైయస్ జగన్ లక్ష కోట్ల రూపాయలను దోచుకున్నారనీ, ఆ డబ్బులతోనే ఎమ్మెల్యేలను, ఎంపీలను కొంటున్నారని ఆరోపించారు. అలాంటి ప్రలోభాలకు లొంగిపోయిన వారిని చిత్తుగా ఓడించాలని కోరారు. పార్టీని వీడిన వారు పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారనీ, వారి బెదిరింపులకు భయపడవద్దని పిలుపునిచ్చారు. తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని, సామాజిక న్యాయం కోసమే పార్టీ పాటుపడుతున్నానని చెప్పారు.
కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ అవినీతికి కేంద్రంగా మారిందని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే గోదావరి జలాలను తరలించి గిరిజనులకు తాగునీటిని సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అని దీనిని బంగాళాఖాతంలో పడేయాల్సిందేనన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన దోపిడీ మరెక్కడా జరగలేదన్నారు.