అసెంబ్లీ: జగన్పార్టీలో గందరగోళం, 'ప్లాన్'లో మూడుకళ్లు
వారం రోజుల క్రితం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ సవరణను కోరింది. సవరణ కోసం పట్టుబట్టడంతో స్పీకర్ ఓటింగుకు అనుమతించారు. ఆ సమయంలో అధికార కాంగ్రెసు సవరణను వ్యతిరేకించింది. విపక్షాలు అన్ని టిడిపి సవరణకు అనుకూలంగా ఓటేశాయి. అయితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మాత్రం దీనిపై కాసేపు తర్జన భర్జన పడింది. కొద్దిసేపు ఎమ్మెల్యేలు మాట్లాడుకొని ఆలస్యంగా లేచి టిడిపికి మద్దతు పలికారు.
తద్వారా ఎమ్మెల్యేలు టిడిపి సవరణను సమర్థించారు. టిడిపి ఇటీవల ఎస్సీ క్యాటగరైజేషన్ను తలకెత్తుకుంది. దీంతో మాదిగలు ఆ పార్టీకి మద్దతు పలికారు. మాలలు టిడిపిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్ ప్లాన్ సమయంలో టిడిపి చట్రంలో ఇరుక్కుపోయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు టిడిపికి మద్దతు పలకడం ద్వారా వారు కూడా మాలల ఆగ్రహానికి గురికాక తప్పలేదు. మాలలు జగన్ పార్టీ పైన నిప్పులు చెరిగారు.
అసెంబ్లీలో వర్గీకరణకు అనుగుణంగా సబ్ ప్లాన్లో నిధులు కేటాయించాలన్న టిడిపిని సమర్థిస్తూ మాదిగలకు అనుకూలంగా ఓటేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రెండు రోజుల క్రితం మండలిలో మాత్రం మరో రెండు రకాలుగా వ్యవహరించారు. మండలిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీలుగా నలుగురు చలామణి అవుతున్నారు.
వారిలో జూపూడి ప్రభాకర రావు సవరణకు వ్యతిరేకంగా ఓటేశారు. మిగిలిన ముగ్గురు సభకు హాజరు కాలేదు. జూపూడి మాల సామాజిక వర్గం నేత కాబట్టి ఆయన తన వర్గం వారికి అనుకూలంగా వ్యవహరించారు. అయితే పార్టీ పరంగా ఓ క్లారిటీ లేకపోవడంతో ఇది గందరగోళంగా మారిందనే చెప్పవచ్చు. టిడిపి దీనిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీని నిలదీస్తోంది.