సీమాంధ్రలో సైకిల్, తెలంగాణలో కారు: కెసిఆర్కి కొర్రీ
సిపిఐ తెలంగాణకు అనుకూలంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ సాధన కోసమే పుట్టిన పార్టీ. భారతీయ జనతా పార్టీ తెలంగాణకు జై అంటున్నా ఆ పార్టీతో పొత్తుకు సిపిఐ ముందుకు రాదు. తెలుగుదేశం పార్టీతో సిపిఐ సఖ్యంగా ఉంటోంది. అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి టిడిపితో విభేదిస్తోంది. అయితే ఇటీవల నారా చంద్రబాబు నాయుడు తాము తెలంగాణకి వ్యతిరేకం కాదని ప్రకటించడంతో సిపిఐ కొంత సానుకూలంగా ఉంది. అయితే టిడిపిలో పూర్తి స్పష్టత లేకపోవడంతో సిపిఐ తర్జన భర్జన పడుతోంది.
అఖిల పక్షంలో టిడిపి వైఖరిని బట్టి సిపిఐ పొత్తులపై నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణకు టిడిపి వ్యతిరేకమైతే సీమాంధ్రలో టిడిపితోనూ తెలంగాణలో తెరాసతో పొత్తుకు సిపిఐ సిద్ధమవుతోంది. టిడిపి తెలంగాణకు అనుకూలమైతే టిఆర్ఎస్, టిడిపిలను ఒప్పించి మూడు పార్టీలు కలిసి మళ్లీ పోటీ చేసే అవకాశాలను తెర పైకి తీసుకు వస్తోంది. అయితే టిడిపి, టిఆర్ఎస్లు కలుస్తాయా అంటే అది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తి ఉండదు. కానీ రాజకీయాల్లో ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. సిపిఐ ప్రధానంగా తెలంగాణపై దృష్టి సారించింది. ఈ ప్రాంతంలో ఎక్కువ సీట్లలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అరవైకి పైగా అసెంబ్లీ స్థానాల్లో, దాదాపు పది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణలో తమకు అనుకూలంగా ఉన్న పలు నియోజకవర్గాలను ఎన్నుకొని ఆయా స్థానాలలో తప్పకుండా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
పొత్తులు ఉన్నా కొన్ని నియోజకవర్గాలలో మాత్రం ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తోంది. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పార్టీ కూడా ప్రజల్లోకి బాగా చొచ్చుకు పోయింది. దీంతో గెలుపు అవకాశాలు తమకే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు. పద్దెనిమిది నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది.
ఖమ్మం జిల్లాలో 4, నల్గొండలో 3, కరీంనగర్, వరంగల్, అదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చొప్పున, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో నియోజకవర్గంలో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చింది. సిపిఐ ఖచ్చితంగా పోటీ చేయాలని భావిస్తున్న పలు నియోజకవర్గాలపై ఇప్పటికే తెరాస క్యాడర్ ఆశలు పెట్టుకుంది. సిపిఐ నిర్ణయం కెసిఆర్ను ఇబ్బందులకు గురి చేయక తప్పదంటున్నారు.