తెలంగాణలో భూముల ధరలు పెంపు.. జూన్ 5 నుంచి అమల్లోకి..
తెలంగాణలో సవరించిన భూముల ధరలు జూన్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. భూముల ధరలను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం మేరకు ధరలను సవరిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. భూముల విలువల సవరణను శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక మేరకు ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి వివరించారు. ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ విలువల మధ్య వ్యత్యాసాలను పరిశీలించి శాస్త్రీయ పద్ధతిలో కొత్త విలువలను నిర్ణయించామన్నారు.
గత BRS ప్రభుత్వం ఎలాంటి సమగ్ర కసరత్తు లేకుండా.. అశాస్త్రీయ పద్దతుల్లో 2021-22 సంవత్సరాల్లో కేవలం 6 నెలల వ్యవధిలోనే రెండు సార్లు భూముల ధరలను పెంచడంతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచిందని మంత్రి పొంగులేటి గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సవరణలు క్షేత్రస్థాయి అధ్యయనం లేకుండా కేవలం శాతం గణనల ఆధారంగా, పట్టికల ప్రకారం చేపట్టడం వల్ల కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా విలువలు నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
వాస్తవ మార్కెట్ ధరలకు.. ప్రభుత్వ విలువలకు మధ్య భారీ అంతరం ఉండటం వల్ల భూ లావాదేవీలలో అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని.. ఈ పరిస్థితులను సరిదిద్దేందుకు రాష్ట్రంలోని అన్ని 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల (SRO) పరిధిలో మార్కెట్ విలువల పునర్విమర్శ చేపట్టామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు స్థానిక పరిస్థితులను పరిశీలించి సవరించిన విలువలను రూపొందించి ఆమోదించాయని పేర్కొన్నారు.

ఇక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ ఈ సవరణలు చేపట్టినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, భూ లావాదేవీలలో పారదర్శకత పెంపునకు, ప్రభుత్వ ఆదాయ వృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications