మీ సీబీఐ దర్యాప్తా ? నా విచారణ కమిషనా ? జగన్ అల్టిమేటం..!
గతేడాది ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ.. విమర్శలు చేస్తున్న వైఎస్సార్సీపీ .. దీనిపై సీబీఐ దర్యాప్తు లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం అధికారులతో వివరణలు ఇచ్చి సరిపెడుతోంది. డీఎస్సీలో ఎలాంటి అక్రమాలు జరగలేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ విపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS jagan)ను డీఎస్సీ బాధితులు కలిశారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి తరలి వచ్చిన డీఎస్సీ అభ్యర్థులు ఈ పరీక్ష నిర్వహణ, ఎంపికలో చోటు చేసుకున్న అక్రమాలపై జగన్ కు వివరించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. డీఎస్సీ అభ్యర్థుల ఆవేదనను విన్న జగన్.. వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. డీఎస్సీ-2025లో అంతులేని అక్రమాలు కనిపిస్తున్నాయని, ఇష్టారాజ్యంగా జీఓలు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని, దీని వల్ల అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని జగన్ ఆక్షేపించారు. వారి తరపున పార్టీ నుంచి న్యాయ పోరాటం చేస్తామన్నారు. దీనికోసం లీగల్ ప్యానెల్ ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు.

అన్యాయం జరిగిన డీఎస్సీ అభ్యర్థులు బాధ పడొద్దని, ఏ మాత్రం ధైర్యం కోల్పోవద్దని, ఓపిగ్గా ఉండాలని జగన్ కోరారు. వారికి ప్రతి అడుగులో తోడుగా ఉంటామన్నారు. అధికారంలోకి రాగానే, కమిషన్ వేసి విచారణ జరిపిస్తామన్నారు. అవసరమైతే ఇలాంటి వారికి అదనపు పోస్టులు సృష్టించి ఇస్తామన్నారు. ప్రభుత్వాన్ని ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరుతున్నామని, వారు కాదంటే వైసీపీ రాగానే విచారణ కమిషన్ వేస్తామని జగన్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications