తొందరెందుకు: ధర్మానపై గవర్నర్, కిరణ్తో విభేదాల్లేవు
ఏఐసిసి పెద్దలను కలవడం తప్పు కాదన్నారు. ధర్మాన ప్రసాద రావు రాజీనామా వ్యవహారంపై తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. మూడు నెలల్లోగా ఫైల్ క్లియర్ చేయమని కోర్టు చెప్పలేదన్నారు. ఫైల్ క్లియర్కు ఎలాంటి కాల పరిమితి లేదన్నారు. ఈ నెల 28న తెలంగాణపై జరగనున్న అఖిల పక్ష సమావేశంపై తాను ఏఐసిసి పెద్దలతో ఎలాంటి చర్చలు జరపలేదన్నారు.
ధర్మాన ప్రాసిక్యూషన్ ఫైల్కు అంత తొందరెందుకని ప్రశ్నించారు. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు విమర్శలు, ఆరోపణలు రావడం సహజమే అన్నారు. కేంద్రమంత్రి కిషోర్ చంద్ర దేవ్ లేఖ పైన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా చెప్పారు. మీ విమర్శలు మీరు చేసుకోవచ్చన్నారు. కాగా నరసింహన్ కేంద్రమంత్రులు గులాం నబీ ఆజాద్, వాయలార్ రవి తదితరులను కలిశారు. చిదంబరం, ఆంటోనీలను కలవనున్నారు.
కాగా గురువారం నరసింహన్ మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వచ్చానని, ఇక్కడకు తాను రాకపోతే మీడియా మర్చిపోతుంది కదా అని సెటైర్ వేశారు. స్నేహితులను చూసి వెళ్దామని వచ్చానని, వచ్చినప్పుడు పెద్దవాళ్లందర్నీ కలవాలన్నారు. తన పర్యటనలో అధికారం, వ్యక్తిగతం ఏమీ లేదని, అన్నీ సాధారణ అంశాలే అన్నారు. ఢిల్లీకి ఊరికే వచ్చానని, చల్లగా ఉందని వచ్చానన్నారు.