సెల్తో జగన్ పాలిటిక్స్, చరిత్రలో నిలవాలనే: చిరు, బాబుపైనా

కలిసికట్టుగా కాంగ్రెసును ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నారు. కాంగ్రెసు పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని, పార్టీ కోసం పని చేయాలన్నారు. ఇప్పుడున్న ఉత్సాహమే 2014 వరకు ఉండాలన్నారు. 2014 కూడా మనదే అని ధీమా వ్యక్తం చేశారు. తాను తన స్వార్థం కోసం రాజకీయాల్లోకి రాలేదన్నారు. ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకే వచ్చానన్నారు. విలీనం విషయంలో తనకు కొన్ని రోజులు ఆగాలని సూచించారని, కానీ తాను వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజల కోసం చూసే వ్యక్తినన్నారు.
అందుకే తాను కొందరు కాంగ్రెసును విచ్ఛిన్నం చేయాలనుకుంటే తాను అండగా నిలబడ్డానని వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. వచ్చినందుకు అనుకున్న ప్రతిఫలం తనకు దక్కకున్నా దక్కిందే చాలనుకున్నానని చెప్పారు. సదస్సు ఉత్తేజంగా ఉందన్నారు. విలీనంకు ముందు జగన్ అధికార దాహంతో కాంగ్రెసును నిర్వీర్యం చేయాలనుకున్నారని ఆరోపించారు. ఏ పార్టీ ప్రాపకంతో అధికారం, ఆస్తి సంపాదించారో ఆ పార్టీనే టార్గెట్ చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.
నిర్వీర్యం చేయాలనుకున్నప్పుడు తాను అండగా నిలబడ్డానన్నారు. తాను ప్రజా సేవ కోసమే వచ్చానన్నారు. తనకు చరిత్రలో నిలిచిపోవాలనే లక్ష్యం తప్ప వ్యక్తిగతంగా మరెలాంటి స్వార్థం లేదన్నారు. సోనియా గాంధీ త్యాగమయి అని ప్రశంసించారు. భేషరతుగా తాను ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేశానన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టాలనుకున్న జగన్ ప్రయత్నాన్ని తాను అడ్డుకున్నానన్నారు. విలీనం వల్ల తాను గర్వపడుతున్నానని చెప్పారు.
జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నాడని, దానికి ఎవరూ లొంగిపోవద్దన్నారు. సైకలాజికల్గా వారు ఆడుతున్న నాటకానికి మనం ప్రభావితం కావొద్దన్నారు. పారదర్శకత కోసమే సమాచార హక్కు అన్నారు. జగన్ మైండ్ గేమ్ ట్రాప్లో పడొద్దన్నారు. కాంగ్రెసు యువ నాయకులను కలిగి ఉందన్నారు. నాయకత్వ సమస్య అసలే లేదన్నారు. అవతలి వాళ్లు తమ చేతిలో మీడియా ఉందని అబద్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. కిందిస్థాయి కార్యకర్తలు బలంగా ఉండాలని, కార్యకర్తలకు మరింత ప్రాధాన్యత పెరగాలన్నారు. అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చంచల్గూడ జైలు నుండి సెల్ఫోన్తో రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. తనే రాష్ట్రానికి భవిష్యత్తు అని నమ్మబలుకుతున్నాడని ఆరోపించారు. తాను నాయకుడిలా కాకుండా సైనికుడిలా పని చేస్తానన్నారు. కలిసి కట్టుగా పని చేస్తే విజయం మనదే అన్నారు.
చంద్రబాబు నాయుడు తన పథకాలను కాంగ్రెసు కాపీ కొడుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన ప్రజా సంక్షేమ పథకాలు ఎక్కడా ప్రవేశ పెట్టలేదన్నారు. కానీ ఈ ప్రభుత్వం ప్రజల కోసమే పని చేస్తోందన్నారు. సోనియా ఆహ్వానంతోనే తాను పిఆర్పీని విలీనం చేశానని చెప్పారు. విద్యార్థులకు కాంగ్రెసు బాసటగా నిలుస్తుందన్నారు. పాదయాత్రలతో షర్మిల, చంద్రబాబులు మనుషుల్లోకి వెళ్లాలని చూస్తున్నారే గాని వారి మనసుల్లోకి వెళ్లాలని మాత్రం చూడటం లేదన్నారు. కాగా విహెచ్ను ఇమిటేట్ చేసిన చిరు అందర్నీ ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications