'ఆల్పార్టీ' వ్యూహం: జైల్లో జగన్.. నెత్తిపై కాంగ్రెస్ తడిబట్ట
హైదరాబాద్: అఖిల పక్ష సమావేశం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఈ నెల 28వ తేదిన అఖిల పక్ష సమావేశం జరగనున్న విషయం తెలిసిందే. దీనిపై ఆయా పార్టీలకు చెందిన నేతల, సమైక్య, తెలంగాణవాదుల వ్యాఖ్యలు హీటెక్కిస్తున్నాయి. ఈ అఖిల పక్ష సమావేశంలో సమస్యకు పరిష్కారం కావాల్సిందేనని తెలంగాణవాదులు, సీమాంధ్ర నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఈ అఖిల పక్ష సమావేశంలో సమస్యకు పరిష్కారం దొరకదని చెబుతున్నారు. తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు తమ వైఖరిని ఖచ్చితంగా స్పష్టం చేయాలని లేదంటే వారిని తెలంగాణ ద్రోహులుగా గుర్తిస్తామని తెరాస చెబుతోంది. మరోవైపు టిడిపి మాత్రం కొత్త వ్యూహానికి పథకాలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అఖిల పక్ష సమావేశంలో కాంగ్రెసు పార్టీనే మొదట అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా ఆ పార్టీ డిమాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అఖిల పక్ష సమావేశంపై జగన్ ఈ రోజు తన సోదరి షర్మిలతో పాటు తెలంగాణ ప్రాంతానికి చెందిన జిట్టా బాలకృష్ణా రెడ్డితో చర్చించారు. త్వరలో మరికొందరు నేతలతో చర్చించి ఫైనల్గా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అఖిలపక్షం వేడి రాష్ట్ర రాజకీయంలో వేడిని రగిలిస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి వాయలార్ రవి తెలంగాణపై తేల్చడం కష్టమని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఆల్ పార్టీ సమావేశంలో సమస్యకు పరిష్కారం దొరకదని తేల్చి చెప్పారు. మొత్తానికి రాష్ట్ర కాంగ్రెసు నేతలు ఈ అంశంపై నెత్తిమీద తడిబట్ట వేసుకొనే ఉందని చెప్పవచ్చు. కిరణ్, బొత్సలు ఈ అంశాన్ని అధిష్టానానికి వదిలేశారు.
అఖిల పక్ష సమావేశానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు, తెరాస పార్టీల మధ్య వేడి రాజుకుంది. ఎవరికి వారు పట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొండా సురేఖ వ్యాఖ్యలు వేడిని రగిలించగా.. కెసిఆర్ వ్యాఖ్యలు అందుకు ఆజ్యం పోశాయి. ఇరు పార్టీలు కొట్లాడుకునే స్థాయికి చేరుకుంది.
అఖిల పక్షంలో చెప్పే అభిప్రాయంపై యాత్రలో ఉండి చంద్రబాబు, జైల్లో ఉండి జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. కెసిఆర్ వారికి కౌంటర్ ఇచ్చే పథక రచనలో బిజీగా ఉన్నారు.
సీమాంధ్రకు చెందిన కావూరి, రాయపాటి, శైలజానాథ్ వంటి నేతలు సమైక్యాంధ్ర కోసం ఎంతకైనా తెగిస్తామని చెబుతున్నారు. అవసరమైతే పార్టీ పెట్టేందుకు సిద్ధమని కావూరి ప్రకటించారు.
సమైక్యాంధ్ర, తెలంగాణ వేడిలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఇటీవల కొత్తగా రాయలసీమ వాదనను బలంగా తెరపైకి తీసుకు వస్తున్నారు. అఖిల పక్ష సమావేశంలో రాయలసీమ రాష్ట్రంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
జెసి, గాదె వంటి రాష్ట్రంలో మూడు ప్రాంతాలున్నాయని గుర్తించాలని, సీమ నుండి ఓ ప్రతినిధిని పంపించాలని డిమాండ్ చేస్తున్నారు.
కోదండరామ్ అఖిలపక్ష సమావేశానికి వెళ్లే అంశంపై బిజెపి, న్యూడెమోక్రసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. జెఏసిలో తాము భాగస్వాములమేనని, అలాంటప్పుడు కోదండ భేటీకి ఎలా వెళ్తారని, అదే నిజమైతే కోదండరామ్ను టీఆర్ఎస్ ఏజెంటుగా గుర్తించాల్సి ఉంటుందంటున్నారు.
ఇటు తెలంగాణ నేతలు తెలంగాణ కోసం పట్టుబడుతుండగా కావూరి, శైలజానాథ్, రాయపాటి వంటి నేతలు సమైక్యాంధ్ర కోసం డిమాండ్ చేస్తున్నారు. ఇంకోవైపు బైరెడ్డి వంటి నేతలు రాయలసీమ వేడి రగిలిస్తున్నారు. మరోవైపు తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు భేటీలో బాబు, జగన్ను ధీటుగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.