వైయస్ అలా అనకపోయి ఉంటే: బాబు, చిరుపై ధ్వజం
ఎవరైనా దేవుడిని మొక్కాలంటే గుడికి వెళ్తారని కానీ కాంగ్రెసు దొంగలు మాత్రం జైలుకు వెళ్లి అక్కడ దండం పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు రెండు అవినీతి పార్టీలే అన్నారు. ఒకటి కాంగ్రెసు ఐ అయితే మరొకటి కాంగ్రెసు వై అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించే ఆలోచన కాంగ్రెసు పార్టీకి లేదన్నారు. నగదు బదలీ పథకాన్ని తాను ఎప్పుడో చెప్పానని, ఇప్పుడు కేంద్రం దానిని కాపీ కొడుతోందన్నారు.
2009 ఎన్నికల్లో కొందరి కుట్ర కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయామన్నారు. సామాజిక ద్రోహానికి పాల్పడ్డ ప్రజారాజ్యం పుట్టకపోయినా, తెరాసతో పొత్తు లేకున్నా, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నంద్యాల సభలో హైదరాబాద్ వెళ్లాలంటే వీసా తీసుకోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు చేయక పోయినా టిడిపి పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చేదన్నారు. అధికారంలో ఉండే నగదు బదలీ పథకాన్ని ఇప్పటికే అమలు చేసే వాళ్లమన్నారు.
కాగా తనపై పోటీచేసి ఓడిపోయిన సతీష్ రెడ్డిని కేసులో ఇరికించడానికి పులివెందులలో మేజిస్ట్రేట్ను పట్టుకొని... చనిపోయిన శవం వేలి ముద్ర వేయించిన ఘనత నాటి వైయస్ రాజశేఖర రెడ్డిదని టిడిపి ఎమ్మెల్యే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి హైదరాబాదులో ఆరోపించారు. అలాంటి దిక్కుమాలిన పనులు చంద్రబాబు ఏనాడూ చేయలేదని.. ఆయన గురించి మాట్లాడే ముందు వైయస్ విజయలక్ష్మి వెనక్కు తిరిగి ఆలోచించుకోవాలని బొజ్జల సూచించారు.